టెట్ పాస్ సర్టిపికేట్ గడువు జీవిత కాలానికి పెంపు: కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెట్ అర్హత సర్టిఫికేట్ గడువును జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. టెట్ క్వాలిఫై అయిన వారికి ఇది తీపికబురే.
టెట్ సర్టిఫికేట్ ఏడేళ్ల గడువును ఎత్తివేస్తూ.. జీవిత కాలం చెల్లుబాటు అయ్యేలా సవరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని రమేష్ పోఖ్రియాల్ సూచించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి టెట్ ను తప్పనిసరిగా చేస్తూ గతంలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కేంద్రం ఆదేశానుసారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ను నిర్వహిస్తున్నాయి. ఒకసారి టెట్ను పాసైతే దాని వ్యాలిడిటీ ఏడేళ్లపాటు ఉండేది. ఈ లోపల ఉద్యోగం సాధిస్తే సరే కానీ, లేదంటే మరోసారి అర్హత సాధించాల్సి ఉండేది. తాజా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇక ఒకసారి టెట్ పాసైతే.. ఉద్యోగం సంపాదించే వరకు దానిని ఉపయోగించుకోవచ్చు. ఈ నిర్ణయంతో అనేకమంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర భావిస్తోంది.
Recommended Video
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారి ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు ీ నిర్ణయం దోహదపడుతుందని విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్నారు. అంతేగాక, ఇప్పటికే టెట్ అర్హత సాధించి ఏడేళ్లు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా కొత్త ధృవపత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అయితే, 2011 నుంచి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇది వర్తించనుంది. దీంతో వారందరికీ కేంద్ర నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.