బీజేపీతో దోస్తీ: పన్నీర్ సెల్వంకు షాక్ ఇచ్చిన సొంత వర్గం నేతలు, ఇప్పుడు ఏం చేద్దాం ?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సొంత వర్గంలోని నేతలు పెద్ద షాక్ ఇచ్చారు. అన్నాడీఎంకే పార్టీ (పురచ్చి తలైవి) వర్గం బీజేపీలో విలీనం చెయ్యడానికి వీల్లేదని చాల మంది నాయకులు అభిప్రాయం వ్యక్తం .
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సొంత వర్గంలోని నేతలు పెద్ద షాక్ ఇచ్చారు. అన్నాడీఎంకే పార్టీ (పురచ్చి తలైవి) వర్గం బీజేపీలో విలీనం చెయ్యడానికి వీల్లేదని చాల మంది నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసి పన్నీర్ సెల్వంకు ఝలక్ ఇచ్చారు.
సోమవారం పన్నీర్ సెల్వం తన వర్గంలోని ఎంపీలతో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తరువాత చెన్నై చేరుకున్న పన్నీర్ సెల్వం తన వర్గంలోని నాయకులతో చర్చలు జరిపారు. అన్నాడీఎంకేలోని మన వర్గాన్ని బీజేపీలో విలీనం చేస్తే ఎలా ఉంటుంది ? అంటూ చర్చలు జరిపారని సమాచారం.
బీజేపీలో మనం విలీనం అయితే పరిస్థితి తారుమారు అవుతోందని, అన్నాడీఎంకే కార్యకర్తలు ఎదురుతిరిగే పరిస్థితి ఎదురౌతుందని పలువురు నాయకులు కుండలుబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. కావాలంటే కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సర్వే జరిపించాలని సూచించారని వెలుగు చూసింది.
తన వర్గంలోని నేతల అభిప్రాయాలు తెలుసుకున్న పన్నీర్ సెల్వం ఇప్పుడు అయోమయంలో పడిపోయారని ఆయన వర్గంలోని నాయకులు అంటున్నారు. మొత్తం మీద తమిళనాడులో పాగ వెయ్యాలని బీజేపీ నాయకులు వేస్తున్న ప్లాన్ ఫలించేటట్లు కనపడటం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.