కాసేపట్లో సభకు బిల్లు: సబ్బం వార్నింగ్, ఫైరింజన్లు రెడీ
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లును గురువారం లోకసభలో ప్రవేశ పెట్టేందుకు సభాపతి మీరా కుమార్ కార్యాలయం చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టికల్ 117(3) ప్రకారం తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టేందుకు సర్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లును మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎంపి సాయి ప్రతాప్, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో సీమాంధ్ర టిడిపి నేతలు భేటీ అయి బిల్లును అడ్డుకునే విషయమై చర్చిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఎంపీలు భేటీ అయ్యారు.
లోకసభలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు బదులు సహాయమంత్రి రామచంద్రన్ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. అనకాపల్లి ఎంపి సబ్బం హరి తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో పార్లమెంటు వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎపికి చెందిన వారికి పాసులను నిరాకరిస్తున్నారు. బిల్లు ప్రవేశ పెడితే తనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు పార్లమెంటులోనే ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ఫైరింజన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎంపీలు, సిబ్బంది, మీడియాకు తప్ప మిగతా వారికి అనుమతి నిరాకరించారు. సెన్సార్లు ఏర్పాటు చేశారు.