వద్దన్నా గుడి కట్టేశారు.. దేవుడంటున్నారు! మరి, మోడీ ఏమంటారో?
ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో ఆయన కోసం ఓ గుడి నిర్మించిన ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్కు 130 మైళ్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో ఆయన కోసం ఓ గుడి నిర్మించిన ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్కు 130 మైళ్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
మోడీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్లో నిర్మించిన ఈ గుడిలో నరేంద్ర మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు జరిపిస్తున్నారు. మున్ముందు ఈ గుడికి సందర్శకుల తాకిడి పెరగడం ఖాయమని గ్రామస్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిపాటు కష్టపడి నిర్మించిన ఈ దేవాలయంలో రూ. 2 లక్షలు వెచ్చించి మోడీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన నరేంద్ర మోడీ యువతరానికి నిజంగా దేవుడేనని ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టిన ఓం ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.
సినిమా తారలపై ఉన్న అభిమానంతో వాళ్లు బతికి వుండగానే వారికి గుడికట్టి ఆరాధించే సంస్కృతి తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. కానీ ఈసారి ఏకంగా ప్రధానమంత్రికే గుడి కట్టేశారు.
గతంలో ఓసారి ఇలాగే తనకోసం కొంతమంది గుడి కట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుకుసున్న మోడీ.. వారి ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. మీకు అంత ఖాళీ సమయం ఉంటే దానిని స్వచ్ఛభారత్ కోసం వెచ్చించండి అంటూ వారికి సూచించారు.
అయితే ఈసారి ఏకంగా గుడి నిర్మాణం పూర్తవడమే కాదు, అందులో మోడీ విగ్రహం పెట్టేసి పూజలు కూడా చేస్తున్నారు. మరి, ఈ దేవాలయం గురించి ప్రధానమంత్రి ఏమని స్పందిస్తారో అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.