కాశ్మీర్ లో ఉద్రిక్తత: కాల్పుల్లో ముగ్గురి మృతి
కాశ్మీర్: కాశ్మీర్ లోయలో మళ్లీ ఆందోళనలు మొదలైనాయి. శనివారం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. ముగ్గురిలో ఓ విద్యార్థి ఉన్నాడు.
ఈ ఘటనతో కాశ్మీర్ లోయ అంతటా ఆందోళనలు ఎక్కువ అయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు సాయుధ బలగాలను తరలించారు. పలు చోట్ల జరిగిన ఈ ఆందోళనల్లో 300 మందికి పైగా గాయపడ్డారు.
గాయాలైన వారిలో పోలీసులు, మిలటరీ సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. పిర్ పంజాబ్, బెనాబ్ వ్యాలీ తదితర ప్రాంతాలకు ఆందోళనలు పాకడంతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. గత నాలుగు వారాలుగా కాశ్మీర్ లోయలో ఆందోళనలు జరుగుతున్నాయి.
55 మంది మరణించారు. దాదాపు మూడు వేల మందికి పైగా గాయపడ్డారు. కాశ్మీర్ ఆందోళనలపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మెడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.
ఇంత జరుగుతున్నా మీరు నిద్రపోతున్నారని, ఎప్పుడు మేల్కొంటారో తెలియడం లేదని ట్వీట్ చేశారు. కాశ్మీర్ లో రోజురోజుకూ ఆందోళనలు పెరిగిపోతుంటే అక్కడ పరిస్థితి మెరుగుపడుతున్నదని కేంద్రం సుప్రీం కోర్టుకు చెబుతున్నదని ఆరోపించారు. 29వ రోజు కాశ్మీర్ లోయలో కర్ఫూ విధించారు.