సెల్ఫీతో దొరికిన ఉగ్రవాది.. భారీ ఎన్కౌంటర్ లో ఆరుగురు హతం
జమ్మూకాశ్మీర్ : షోపియాన్ లో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ కు ఎదురుదెబ్బ తగిలింది. వీటికి చెందిన జిల్లా కమాండర్లను అంతమొందించింది భారత సైన్యం. కప్రన్ బటగుండ్ ఏరియాలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులతో పాటు ఒక సైనికుడు ప్రాణాలు విడిచారు. కుల్గాం హిజ్బుల్ కమాండర్ గా పనిచేస్తున్న ఉమర్ మజీద్ ఘనీ మృతుల్లో ఒకడు. పోయిన వారం లాల్ చౌక్ దగ్గరలోని ఘంటా ఘర్ ప్రాంతంలో ఫోటోలకు ఫోజులిచ్చాడు. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో భద్రతా దళాలకు చేరింది. దీంతో ఘనీ ఆచూకీ కనిపెట్టింది సైన్యం.
పోలీసులపై దాడులు చేయడంతో సిద్ధహస్తుడిగా పేరున్న ఘనీ ఆచూకీ కోసం పోయినేడాది 10 లక్షల రివార్డు ప్రకటించారు కాశ్మీర్ పోలీసులు. 2017 మే నెలలో ఐదుగురు పోలీసులతో పాటు మరో ఇద్దరిని హత్య చేశాడు. చిన్న వయసులోనే ఉగ్రవాదానికి ఆకర్షితుడైన ఘనీ.. 20 ఏళ్లకు ఆ సంస్థలో చేరాడు. 2016 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ఈమధ్య కాలంలో బాట్మల్ ఎన్కౌంటర్ జరిగింది. ఆ సమయంలో తృటిలో తప్పించుకున్నాడు. తాజాగా సెల్ఫీ దిగి పోస్ట్ చేయడంతో ఘనీ ఆచూకీ సైన్యానికి దొరికింది. దీంతో వేట ముమ్మరం చేసిన భద్రతా దళాలు వారు సమావేశమైన ప్రదేశంపై అటాక్ చేశారు.