రిజర్వేషన్ల గొడవ: వసుంధర రాజే ముందు జాగ్రత్త
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం వలన ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 68 శాతానికి చేరింది. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. గుజరాత్లో హార్దిక్ పటేల్ ఉద్యమం నేపథ్యంలో వసుంధర రాజే ముందు జాగ్రత్త తీసుకుని వ్యూహాత్మకంగా గుజ్జర్లకు, ఈబిసిలకు రిజర్వేషన్లు కల్పించినట్లు భావిస్తున్నారు.
వాస్తవానికి చట్టపరంగా గరిష్టంగా మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకూడదు. అయితే రాజస్థాన్ ప్రభుత్వం మంగళవారం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అక్కడి గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్ బీసీ) కోటా కింద ఐదు శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆమోదించారు.
అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చడం ద్వారా వాటికి న్యాయపరమైన అడ్డంకులురాకుండా చూడాలని వసుంధర రాజె ప్రభుత్వం కేంద్రానికి మనవి చేసింది.
రిజర్వేషన్ల వ్యవస్థనే మొత్తం సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక్క రోజు తరువాత రాజస్థాన్ లోని బీజేపీ సర్కారు ఈ సంచలనమైన నిర్ణయం తీసుకునింది. ఈ దెబ్బతో ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.