అదిరేది లేదు.. బెదిరేది లేదు..! కశ్మీర్ లోయలో బలగాల మొండి ధైర్యం..!!
కశ్మీర్/హైదరాబాద్ : భారత భద్రతా దళాలు పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాయి. కశ్మీర్ లోయలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మడమ తిప్పేది లేదంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా పారిపోయేది లేదని తెగేసి చెప్పుకొస్తున్నాయి కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సంసిద్ధమయ్యాయి. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. మరోవైపు కశ్మీర్లో ఉద్రిక్త, ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఉగ్రవాదుల దాడి ముప్పు పొంచి ఉంచడం, నియంత్రణ రేఖ వెంబడి పాక్తో ఘర్షణలు పెరిగిన నేపథ్యంలో కీలక ప్రాంతాలు, సునిశిత ప్రదేశాల్లో భద్రతా బలగాల మోహరింపును అధికారులు పెంచారు. అమర్నాథ్ యాత్రను అర్ధంతరంగా రద్దు చేసి, పర్యాటకులందరినీ కశ్మీర్లోయను విడిచి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించిన నేపథ్యంలో స్థానికులు నిత్యావసర సరకుల కోసం మార్కెట్లకు తరలడంతో దుకాణాలు, చమురు బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి.
దేనికైనా రెఢీ..! అత్యంత అప్రమత్తంగా భద్రతా బలగాలు..!!
డోభాల్ తదితరులతో షా భేటీ..! కీలక ప్రాంతాల్లో సైన్యం మోహరింపు..!!
ఢిల్లీలోని పార్లమెంటు సముదాయంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్షా కశ్మీర్ అంశంపై భద్రత బలగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఏం మాట్లాడుకున్నారనేది నిర్దిష్టంగా తెలియరాలేదు. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబ, ఐబీ అధిపతి అర్వింద్ కుమార్, రా చీఫ్ సామంత్కుమార్ గోయెల్, హోంశాఖ సీనియర్ అధికారులు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వ్యాపార సముదాయాల వద్ద భారీ క్యూలు..!ఆందోళనలో కశ్మీర్ వాసులు..!!
నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాక్ సైనికుల మధ్య తాజాగా ఘర్షణలు పెరిగిన క్రమంలో సమావేశం జరిగింది. జమ్మూకశ్మీర్లోని ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనే భాజపా నిర్ణయం నేపథ్యంలో కశ్మీర్లోయలో భద్రతా పరిస్థితిపై అమిత్షా సమీక్షించారు. పార్లమెంటు సమావేశాల అనంతరం అమిత్షా కశ్మీర్ను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ, ఉధంపూర్, కాట్రాల నుంచి బయల్దేరే రైళ్లలో టికెట్ల తనిఖీ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
భద్రతాధికారులతో అమిత్షా సమీక్ష..!పరిస్తితి అదుపులో ఉందన్న అదికారులు..!!
అమర్నాథ్ యాత్రికులు తదితరులు రిజర్వేషన్ టికెట్లు లేకపోయినా రాష్ట్రం నుంచి సాఫీగా వెళ్లిపోయేందుకు వీలవుతుందని భావిస్తోంది. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపొరాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐయూఎస్టీ) అన్ని పరీక్షలనూ వాయిదా వేసింది. వసతి గృహాలు ఖాళీ చేసి, ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులను కోరింది. గందరగోళ పరిస్థితులు, కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీనగర్లోని ఎన్ఐటీ విద్యార్థులు ఆదివారం జమ్మూ నుంచి స్వస్థలాలకు బయల్దేరారు. ఆగస్టు 15 తర్వాత కళాశాల పునః ప్రారంభమవుతుందని ఆశిస్తున్నామని ఏపీకి చెందిన పరమేశ్వర్రెడ్డి అనే విద్యార్థి ఆశాభావం వ్యక్తం చేశారు.