కర్ణాటకలోని ఆ దూరదర్శన్ కేంద్రం మూసివేత సమాచారంపై ప్రసార భారతి సీఈఓ ఏం చెబుతున్నారంటే..?
బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా)లో గల దూరదర్శన్ కేంద్రాన్ని మూసివేస్తారంటూ వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 31వ తేదీ నాటికి ఈ కేంద్రం మూతపడుతుందంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఛానెల్ నంబర్ 7, ఫ్రీక్వెన్సీ 195.25 మెగా హెర్ట్జ్ విజువల్, 189.75 అరల్గా ప్రస్తుతం ప్రసారం అవుతోన్న కలబురగి దూరదర్శన్ కేంద్రం స్లాట్ ఇక సీజ్ అవుతుందంటూ ప్రసారభారతి డైరెక్టర్ జనరల్ నుంచి ఆదేశాలు అందినట్లు వార్తలు వెలువడ్డాయి.
Media should conduct itself in a responsible manner verifying all facts. Theres no change in content creation by Doordarshan Kalaburagi. Content from DD Kalaburagi will continue to be aired on @ddchandanabng in it its designated slot apart from digital platforms and social media. https://t.co/BKB07tk6pu
— Shashi S शशि शेखर (@shashidigital) October 9, 2021
సుమారు 75 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల వరకు తన కార్యక్రమాలను ప్రసారం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న ఈ దూరదర్శన్ స్టేషన్ మూతపడుతుందనేది ఆ కథనాల సారాంశం. ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా స్థానిక కార్యక్రమాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేసిందని, ఇక పూర్తిగా మూతపడబోతోందంటూ వచ్చిన వార్తలు దుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 152 ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల నుంచి ఈ నెల 31వ తేదీ తరువాత ఎలాంటి ప్రసారాలు కూడా అందుబాటులో ఉండవనే వదంతులు చెలరేగాయి.
44 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలను అందించిన కలబురగి దూరదర్శన్ కేంద్రాన్ని మూసివేయాలంటూ ప్రసార భారతి నిర్ణయం తీసుకుందని, దాని వల్ల స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందంటూ ఇంగ్లీష్, కన్నడ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాల పట్ల ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి శశి శేఖర్ వెంపటి స్పందించారు. ఈ కథనాల పట్ల ఆయన ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కలబురగి దూరదర్శన్ కేంద్రాన్ని మూసివేస్తారనడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలను కొట్టి పారేశారు. పాత ట్రాన్స్మీటర్స్ పని చేయట్లేదనే సమాచారాన్ని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రజెంట్ చేశాయని అన్నారు. కలబురగి దూరదర్శన్ కేంద్రానికి సంబంధించి కంటెంట్లో ఎలాంటి మార్పు చేయట్లేదని శశి శేఖర్ వెంపటి తేల్చి చెప్పారు. కలబురగి దూరదర్శన్ కేంద్రాన్ని మూసివేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
There is no ambiguity or confusion. Closure of obsolete analog transmitter in Kalaburagi has nothing to do with content generation by doordarshan studios in Kalaburagi which will continue to produce content and that content will be available on DD Chandana.
— Shashi S शशि शेखर (@shashidigital) October 9, 2021
దూరదర్శన్ కలబురగి కేంద్రం ప్రసారాలు ఎప్పట్లాగే.. దూరదర్శన్ చందనలో టెలికాస్ట్ అవుతాయని పేర్కొన్నారు. అలాగే- సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్పై నిర్దేశిత స్లాట్లల్లో ప్రసారమౌతాయని అన్నారు. దేశంలో రూఫ్టాప్ యాంటెన్నాల ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలు ఎక్కువ రోజులు ప్రసారం కాబోవని, సంస్కరణల్లో భాగంగా అనలాగ్ ట్రాన్స్మీటర్స్ను దశాబ్దాల కాలం కిందటే అమర్చామని చెప్పారు.
కలబురగి దూరదర్శన్ కేంద్రంలో పాత అనలాగ్ ట్రాన్స్మీటర్లను నిలిపివేయడం అంటే స్టేషన్ను మూసివేసినట్టు కాదని అన్నారు. ఈ స్టేషన్లో కార్యక్రమాలు, ఇతర ప్రసారాల రూపకల్పన యధాతథంగా కొనసాగుతుందని, అవన్నీ దూరదర్శన్ చందనలో అందుబాటులో ఉంటాయని శశి శేఖర్ వెంపటి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అస్పష్టత గానీ, గందరగోళం గానీ లేదని వివరించారు. వాస్తవాలను తెలుసుకుని కథనాలను ప్రచురించాలని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.