మస్ట్ రీడ్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ బడ్జెట్ రూపకల్పన..మీకు తెలుసా?
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిగతులను డిసైడ్ చేసే కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్లో ఏఏ రంగానికి అధిక ప్రాధాన్యత లభిస్తుందో ఎవరికీ తెలియదు. దీనిపై చివరి వరకు అంటే సభలో ఆర్థికశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించేవరకు అతి రహస్యంగానే ఉంచుతారు. అంతేకాదు ఎంతో శ్రమతో తయారు చేసిన ఈ బడ్జెట్ కేటాయింపుల సమాచారం ఎక్కడ లీక్ కాకుండా ప్రభుత్వం అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఇంతకీ బడ్జెట్ ప్రతులను రహస్యంగా ఉంచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..?

నార్త్ బ్లాక్లో బడ్జెట్ ప్రిపరేషన్
ఢిల్లీలోని సెక్రటేరియట్లో ఉన్న నార్త్బ్లాక్ కార్యాలయంలో కేంద్రఆర్థికశాఖ కార్యాలయం ఉంటుంది. ఈ నార్త్బ్లాక్కు అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మూడు వారాల నుంచి గట్టి భద్రత ఈ నార్త్ బ్లాక్ చుట్టూ ఉంటుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ దళాలు నార్త్బ్లాక్ చుట్టూ మోహరించి ఉంటాయి. నవంబర్ నెలలో బడ్జెట్ రూపకల్పన ప్రారంభించిన నాటి నుంచే క్రమంగా భద్రతను పెంచుతూ వస్తుంది ప్రభుత్వం. ఇక జనవరి నెల రాగానే భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతుంది.

బడ్జెట్ ప్రింటింగ్కు సంకేతం హల్వా వేడుకలు
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయనగా కొద్ది రోజుల ముందు హల్వా వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హల్వా వేడుకల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పాల్గొంటారు. బడ్జెట్ తయారీ అయిపోయి ఇక ప్రింటింగ్ను ప్రారంభిస్తారని సంకేతాలు పంపేందుకు ఈ హల్వా వేడుకలను జరుపుతారు. హల్వా తయారు చేసి బడ్జెట్ కోసం కష్టపడిన సిబ్బందికి ఇస్తారు కేంద్రమంత్రి. ఈ సారి కూడా హల్వా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాతో సిబ్బంది నోళ్లను తీపి చేశారు. ఇక బడ్జెట్ ప్రతులను ఒక గదిలో ఉంచి తాళం వేస్తారు. ప్రింటింగ్కు వెళ్లే వరకు ఆ ప్రతులు అక్కడే ఉంటాయి.

బ్లూషీట్లోనే కీలక రంగాలకు కేటాయింపులు
ఇక బడ్జెట్లో ఉంటే బ్లూషీట్ చాలా కీలకం. దీన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఈ బ్లూషీట్లోనే కీలక రంగాలకు జరపుతున్న బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. దీన్ని గట్టి భద్రత నడుమ ఉంచుతారు. ఇది ఆర్థికశాఖ మంత్రి కూడా తన వద్ద ఉంచుకునేందుకు నిబంధనలు ఒప్పుకోవు. ఇది బడ్జెట్ జాయింట్ సెక్రటరీ వద్ద మాత్రమే ఉంటుంది. బడ్జెట్ సమావేశాల కంటే కొన్ని వారాల ముందు ఈ బ్లూషీట్ తొలి ముసాయిదాను తయారు చేస్తారు. అన్ని బడ్జెట్ లెక్కలకు ఈ బ్లూషీట్ ప్రధాన మూలంగా ఉంటుంది.

బడ్జెట్ ప్రసంగం వరకు నార్త్బ్లాక్లోనే అధికారులు
ఇక హల్వా వేడుకల తర్వాత బడ్జెట్ తయారీలో కీలకంగా వ్యవహరించిన 100 మంది అధికారులను నార్త్బ్లాక్లోనే ఉంచుతారు. వారికి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. నార్త్ బ్లాక్లో ఉన్న రెండు ప్రింటింగ్ ప్రెస్ల మధ్యే వారుంటారు. ఎందుకంటే బయటికొస్తే వారు బడ్జెట్ సమాచారం లీక్ చేయొచ్చేమో అన్న అనుమానంతోనే ఇలా వారిని నార్త్బ్లాక్కే పరిమితం చేస్తారు. ఇలా బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టేవరకు వారు లోపలే ఉంటారు. వీరంతా బడ్జెట్కు సంబంధించి ప్రింటింగ్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్లేషన్స్ చేస్తారు.

అధికారులకు అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది
ఆ ప్రింటింగ్ గది మొత్తం ఎయిర్ కండీషన్డ్తో ఉంటుంది. అంతేకాదు అత్యాధునిక ప్రింటింగ్ మెషీన్లు అక్కడ ఉంటాయి. ఇక లోపల ఉన్న అధికారులకు లేదా సిబ్బందికి ఫోన్లు ఉండవు. అకామొడేషన్ ఆహారం ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇక ఎమర్జెన్సీ సమయంలో అధికారి లేదా సిబ్బంది ఫోన్ కాల్స్ చేయాలంటే వారు ఒక ఇంటెలిజెన్స్ అధికారి ఎదుటే మాట్లాడాల్సి ఉంటుంది. ఇక అత్యంత భద్రతా వలయంలో ఉన్న నార్త్బ్లాక్లోకి ప్రవేశించేందుకు లేదా బయటకొచ్చేందుకు ఒక్క ఆర్థికశాఖ మంత్రికి మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా మొబైల్ ఫోన్ లేకుండా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. బడ్జెట్ ప్రకటనకు కొన్ని గంటల ముందు బడ్జెట్ ప్రసంగం తయారు చేయడం జరుగుతుంది.

అత్యాధునిక వ్యవస్థతో నిఘా
జనవరి నెల రాగానే నార్త్ బ్లాక్ వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేస్తారు. మీడియాను అస్సలు అనుమతించరు. భద్రతా చర్యల్లో భాగంగా ఎక్స్రే స్కానింగ్ మెషీన్లను వినియోగిస్తారు. నార్త్ బ్లాక్లోకి ఎవరు వెళుతున్నారు ఎవరు బయటకొస్తున్నారు అనేదానిపై గట్టి నిఘా పెడుతుంది ఇంటెలిజెన్స్ శాఖ. మొబైల్ ఫోన్ల వినియోగం లేకుండా జామర్లను పెడతారు. ఇంటర్నెట్ కనెక్షన్లు తీసేస్తారు. ల్యాండ్ లైన్ ద్వారా చేసే ఫోన్ కాల్స్ పై నిఘా ఉంచుతారు. మొత్తానికి బడ్జెట్ తయారీ ఇంత గట్టి భద్రతా వలయం మధ్య రూపొందుతుంది.












Click it and Unblock the Notifications