మోసం: అతిపెద్ద బ్యాంక్పై గెలిచిన చాయ్ వాలా
భోపాల్: ఐదవ తరగతి చదివి, టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్న ఓ సాధారణ వ్యక్తి.. తనను మోసం చేసిన భారతదేశంలో అతిపెద్ద బ్యాంకుగా గుర్తింపు పొందిన బ్యాంకుపై పోరాడి గెలుపొందాడు. తను బ్యాంకులో దాచుకున్న సొమ్ము పోయిందని వస్తే.. ఆ బ్యాంకు అధికారులు చీవాట్లు పెట్టి వెళ్లగొట్టారు.
దీంతో అతడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. చివరకు కోర్టులో ఆ బ్యాంకుపై గెలిచి తను దాచుకున్న సొమ్ముతోపాటు తనకు అయిన ఖర్చులు కూడా దక్కించుకున్నాడు. అతడే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్కు చెందిన చాయ్ వాలా రాజేష్ సాక్రే.
వివరాల్లోకి వెళితే.. సాక్రే భోపాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో 20,000 రూపాయల నగదు దాచుకున్నాడు. ఇందులోంచి 10,800 రూపాయలు డ్రా చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన ఖాతాలో ఉండాల్సిన మరో 9,200 రూపాయలు మాయమయినట్టు గుర్తించాడు. ఈ సంఘటన 2011లో జరిగింది.
సాక్రే ఈ విషయంపై బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేస్తే అతణ్నే మందలించారు. ముంబైలోని ఎస్బిఐ హెడ్ క్వార్టర్స్కు ఫిర్యాదు చేసినా సమాధానం రాలేదు. దీంతో జిల్లా కంజూమర్ ఫోరమ్ను ఆశ్రయించాడు. ఆర్థిక స్థోమతలేని కారణంగా తన కేసును తానే వాదించుకున్నాడు. కాగా, ఆ బ్యాంకు.. సాక్రే డబ్బు డ్రా చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ సహా ఎలాంటి సాక్ష్యాలు చూపలేకపోయింది.
దీంతో పలుసార్లు విచారణ జరిగిన అనంతరం సాక్రే కేసును గెలిచాడు. జూన్ 16న కంజూమర్ కోర్టు సాక్రేకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సాక్రేకు రావాల్సిన 9,200 రూపాయల నగదుతో పాటు దానికి వడ్డీ, కోర్టు ఖర్చుల కింద 2,000 రూపాయలు, మానసిక ఒత్తిడి కలిగించినందుకు మరో 10 వేల రూపాయలను చెల్లించాల్సిందిగా కోర్టు బ్యాంక్ అధికారులను ఆదేశించింది.
ఈ మొత్తాన్ని రెండు నెలలలోపు అతని ఖాతాలో జమచేయాల్సిందిగా సూచించింది. సామాన్యులకు రాజేష్ సాక్రే విజయగాథ స్ఫూర్తిగా నిలిచింది.