ఆ నిబంధన పాటించని వారికి సంక్షేమ పథకాలు కట్ - ఓటు హక్కు కూడా తొలగింపు
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నాటికి దేశ జనాభా భారీగా పెరగబోతోందని, ఈ విషయంలో చైనాను సైతం అధిగమిస్తుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరో ఏడాది కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందంటూ వెలువడిన అంచనాలపై ఆయన మాట్లాడారు.
యాక్షన్ ప్లాన్..
దేశంలో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. జనాభా పెరిగిపోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించారు. జనాభా పెరిగిపోవడం వల్లే సమతౌల్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. దీన్ని నియంత్రించడానికి తక్షణ కార్యాచరణ ప్రణాళికలను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా జనాభా నియంత్రణ బిల్లును రూపొందించనున్నట్లు తెలిపారు.
అసమతౌల్యం..
జనాభా పెరుగుదల వల్ల మతపరమైన అసమతౌల్యం ఏర్పడే అవకాశం లేకపోలేదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వివరించారు. ప్రజలకు అవగాహన కలిగించినప్పుడే జనాభా నియంత్రణ బిల్లు ఉద్దేశం నెరవేరుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో దేశంలో జనాభా నియంత్రణ బిల్లు అత్యంత కీలకంగా మారుతుందని గిరిరాజ్ సింగ్ జోస్యం చెప్పారు. అన్ని మతాల వారికీ సమానంగా ఈ బిల్లును వర్తింపజేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
చైనా భేష్..
వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జనాభా నియంత్రణ వంటి కఠిన చట్టం, విధానాలను అమలు చేయడంలో చైనా విజయం సాధించిందని గిరిరాజ్ సింగ్ అన్నారు. చైనా ప్రభుత్వం వన్ ఛైల్డ్ పాలసీని విజయవంతంగా అమలు చేసిందని కితాబిచ్చారాయన. చైనాలో ప్రతి నిమిషానికి 10 మంది పిల్లలు పుడుతుంటే.. భారత్లో ఈ సంఖ్య 30గా ఉందని చెప్పారు గిరిరాజ్ సింగ్.
సంక్షేమ పథకాలు కట్..
జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఎంత ఉందో.. దాన్ని అంతే కఠినంగా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఈ బిల్లులో పొందుపరిచే నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని వారికి సంక్షేమ పథకాల లబ్దిని తొలగించాలని ఆయన పిలపునిచ్చారు. అలాంటి వారు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోని విధంగా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
గతంలో మోహన్ భగవత్..
గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. విజయదశమి నాడు నాగ్పూర్లో నిర్వహించిన సమావేశంలో దీనిపై మాట్లాడారు. దేశంలో మతపరమైన అసమానతలు భారీగా పెరిగిపోయాయని, ఈ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.