టిఫిన్ పే చర్చ షురూ.. బీజేపీ కొత్త ప్లాన్ గురూ!!
వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ చేసిన బిజెపి దేశంలో అధికారం చేపట్టాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లోక్సభ సీట్లు కీలకమని భావిస్తుంది. ఈ క్రమంలోనే సరికొత్త వ్యూహంతో బిజెపి యూపీలో కార్యాచరణ మొదలుపెట్టింది.
ఇంతకాలం చాయ్ పే చర్చా ద్వారా ప్రజలకు దగ్గరైన బీజేపీ.. ఇక నుంచి టిఫిన్ పే చర్చా కార్యక్రమం ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి టిఫిన్ పే చర్చా కార్యక్రమాన్ని ప్రాంభించింది. టిఫిన్ పే చర్చా కార్యక్రమం ద్వారా కార్యకర్తలను ఐక్యంగా ఉంచడం, కార్యకర్తల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చేస్తుంది.

టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో భాగంగా బిజెపి నేతలందరూ తమ ఇండ్లలో చేసిన టిఫిన్ లను ప్యాక్ చేసుకుని తెచ్చి అందరూ ఒకే చోట తింటారు. టిఫిన్ చేస్తూ అందరూ కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి, ప్రజల్లోకి వెళ్లడానికి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించి సరైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు. ఈ కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగనుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1918 ప్రాంతాలలో టిఫిన్ పే చర్చ సమావేశాలు జరగనున్నాయి. టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన లీడర్లు పాల్గొని..ప్రజలకు మరింత చేరువ అవడానికి తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యచరణ గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బీజేపీ శ్రేణులు అందర్నీ ఒక తాటిమీద నడిపించాలన్న ప్రధాన ఉద్దేశం కనిపిస్తుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్ లోని ఎంపీ సీట్లలో విజయం సాధించటం ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో మరోసారి ఇక్కడ ఎక్కువ సీట్లలో గెలిస్తే ఈజీగా మూడోసారి అధికారాన్ని చేపట్టవచ్చని బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2024 ఎలక్షన్స్ టార్గెట్ గా బిజెపి వేసిన ఈ బడా ప్లాన్ టిఫిన్ పే చర్చ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications