కలిసికట్టుగా ముందుకు సాగుదాం -దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూ ఇయర్ మెసేజ్
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, కరుణ, సహనంతో కూడిన సమాజం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయనొక సందేశాన్ని వెలువరించారు.
ప్రతి కొత్త ఏడాది కొత్త ప్రారంభానికి అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్న రాష్ట్రపతి.. వ్యక్తిగత, సమైక్య అభివృద్ధికి సంకల్పం చేయాలన్నారు. కొవిడ్-19 లాంటి కష్టసమయంలో అందరం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
భారతీయ సాంస్కృతిక విలువలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన సమయం కూడా ఇదేనని రాష్ట్రపతి కోవింద్ అభిప్రాయపడ్డారు. దేశంలోని అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దేశ పురోగతి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు నూతన శక్తితో ముందుకు సాగాలని కోరారు.

నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలతోపాటు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాష్ట్రపతి అన్నారు. దేశ వర్తమాన పరిస్థితులు, విదేశీ వ్యవహారాలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతిని కలిసి బ్రీఫింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..
కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలో పర్యటన సందర్భంలో కొత్త ఏడాదిపై రాష్ట్రపతి కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021నుంచైనా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఘోగ్లా బీచ్లో జాగింగ్ చేస్తున్న వీడియోను ఆయన షేర్ చేస్తూ.. ఒక కష్టతరమైన ఏడాదిని పూర్తిచేసుకొని 2021లోకి అడుగుపెడుతన్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అని రాష్ట్రపతి సోమవారం ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications