మమతను టచ్ చేసినా, అరెస్ట్ చేసినా..: కేంద్రానికి టీఎంసీ ఎంపీ తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం నాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు కేంద్రం పైన ఘాటుగా స్పందించారు. తమ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అరెస్టు చేస్తే బెంగాల్ మండిపోతుందని కేంద్రాన్ని హెచ్చరించారు.
పశ్చిమ బంగాలో శారదా కుంభకోణం రగడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రగడ పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ ఇడ్రిస్ అలీ కేంద్రానికి ఘాటైన హెచ్చరికలు చేశారు. ఆంగ్ల మీడియాలో వస్తున్న కథనం ప్రకారం అతను పై వ్యాఖ్యలు చేశారు. ఈ హెచ్చరికలు కెమెరాలో నిక్షిప్తమైనట్లుగా తెలుస్తోంది.
మమతను టచ్ చేసినా, అరెస్టు చేసినా బెంగాల్ మండిపోతుందని హెచ్చరించారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తమ అధినేత్రిని ఏం చేయలేరన్నారు.
మరోవైపు మరో టీఎంసీ ఎంపీ శతాబ్దీ రాయ్కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) త్వరలో సమన్లు జారీ చేయవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. శారదా కుంభకోణం దర్యాఫ్తు నేపథ్యంలో ఆయనకు సమన్లు జారీ చేయవచ్చంటున్నారు.
కాగా, శారదా కుంభకోణంలో అత్యంత లబ్ధిపొందింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని ఆ కుంభకోణంలో అరెస్టైన కునాల్ ఘోష్ వ్యాఖ్యానించారు. శారదా స్కాం కుంభకోణంలో సీబీఐ నలుగురు టాప్ తృణమూల్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications