సీబీఐ కోర్టులో చిదంబరానికి లభించని ఊరట.. మరోరోజు సీబీఐ కస్టడీకి ...
న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కోర్టులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రికి ఊరట లభించలేదు. ఆయన కస్టడీ మరో రోజు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ్టితో కస్టడీ ముగియనుండటంతో .. విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇప్పటికే 11 రోజులు విచారించినందున .. బెయిల్ ఇవ్వాలని చిదంబరం తరఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక జడ్జీ అజయ్ కుమార్ మరోరోజు కస్టడీకి ఇస్తున్నట్టు ప్రకటించారు.
చిదంబరం సీబీఐ కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత 5, తర్వాత నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చారు. సెప్టెంబర్ 2తో కస్టడీ గడువు ముగియడంతో చిదంబరం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.
ట్రయల్ కోర్టులో విచారించాలని .. తీహర్ జైలుకు మాత్రం తరలించొద్దని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. చిదంబరం వయస్సు 76 ఏళ్లు అని .. అతని వయస్సును పరిగణలోకి తీసుకొని తీహర్ జైలుకు తరలించొద్దని సూచించారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ కేసు పరిణామాలు, తీవ్రత దృష్ట్యా సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు జడ్జీ అజయ్ కుమార్ అంగీకరించారు. మంగళవారం వరకు చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇచ్చారు.