అసలు ఫ్యాక్టరీ పనిచేయడమే లేదు..: తూత్తుకుడి స్టెరిలైట్ కంపెనీ
చెన్నై: తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ హింసాకాండపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. స్వచ్చమైన గాలి పీల్చే హక్కు కూడా ప్రజలకు లేదా? అని సామాజిక ఉద్యమకారులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆందోళనకారులను పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తున్నారు.
మరోవైపు అసలు ఆ ఫ్యాక్టరీ పనిచేయడం లేదంటూ స్టెరిలైట్ యాజమాన్యం ప్రకటించడం గమనార్హం. 'మార్చి 27 నుంచి కర్మాగారం పనిచేయడం లేదు. కంపెనీ లైసెన్సు గడువు ముగియడంతో పునరుద్ధరణ కోసం ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. కానీ తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి మా దరఖాస్తును తిరస్కరించింది. కర్మాగారం తెరిచేందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం' అని ఒక ప్రకటనలో యాజమాన్యం వెల్లడించింది.

అంతేకాదు, స్టెరిలైట్ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేసింది. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి భద్రతను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి కూడా చేసింది.
12మంది మృతి:
తూత్తుకుడిలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటిదాకా 12మంది మృతి చెందారు. ఘటనపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ జడ్జి అరుణాజగదీషన్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు బుధవారం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications