అపూర్వ కల్యాణం.. కవల అన్నదమ్ములకు కవల అక్కాచెల్లెళ్లతో పెళ్లి!
సాధారణంగా పెళ్లిళ్లలో అలంకరణలు, విందు విశేషాల గురించి మాట్లాడుకుంటారు. కానీ కేరళలోని చంగనస్సేరిలో జరిగిన ఒక వివాహం మాత్రం చరిత్రలోనే ఒక అరుదైన అద్భుతంగా నిలిచిపోయింది. పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్లే కాదు.. వారి పెళ్లి జరిపించిన పాస్టర్లు, చివరకు సహకరించిన కుర్రాళ్లు కూడా కవలలే కావడం విశేషం. ఈ అరుదైన దృశ్యం చూసి పండగ మండపంలోని బంధుమిత్రులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.
చంగనస్సేరికి చెందిన కంజుమోన్ థామస్, జోమోల్ దంపతుల కవల కుమారులు అఖిల్, నిఖిల్.. పతనం తిట్ట జిల్లాకు చెందిన తోమిచన్, మేరీకుట్టి దంపతుల కవల కుమార్తెలు మేగి, మరియాలను వివాహం చేసుకున్నారు. అఖిల్.. మేగి చేయి అందుకోగా, నిఖిల్.. మరియా మెడలో తాళి కట్టాడు. చిన్నతనం నుంచే తమ వివాహం అంతా కవలల మధ్యే జరగాలని, అది కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని భావించిన ఆ అక్కాచెల్లెళ్ల కోరికను దేవుడు ఇలా నెరవేర్చాడని పెళ్లికూతుళ్లు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

పూజారులు, తోడపెళ్లివారూ జంటగానే!
ఈ పెళ్లికి మరొక ప్రత్యేకత ఏమిటంటే.. కాంజిరపల్లి డయాసిస్కు చెందిన ఫాదర్ ఆంటో, ఫాదర్ జో అనే కవల పాస్టర్లే ఈ వివాహ వేడుకను దగ్గరుండి జరిపించారు. వారితో పాటు బలిపీఠం వద్ద సాయంగా నిలిచిన జెరోన్, జోహన్ అనే చిన్నారులు కూడా కవల సోదరులే కావడం విశేషం. ఈ వినూత్న ఆలోచన కోసం వధువులు కొథనల్లూరులోని ఒక చర్చి సహాయంతో కవల పాస్టర్లను వెతికి మరీ ఆహ్వానించారు. తాము కూడా ఒకేసారి పూజారులుగా మారిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ వేడుక తమ జీవితంలోనే మరచిపోలేని మధురానుభూతిని ఇచ్చిందని ఆ పూజారులు తెలిపారు.
కొత్త జీవితంలోకి ఒకేసారి..
వరులిద్దరూ మర్చంట్ నేవీలో ఉద్యోగాలు చేస్తుండగా, వధువులు ఐటీ రంగంలో స్థిరపడ్డారు. వృత్తులు వేరైనా, జీవితంలో ప్రతి ఘట్టాన్ని పంచుకుంటూ పెరిగిన ఈ జంటలు ఇప్పుడు ఒకే వేదికపై కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఒకే ముహూర్తంలో, ఒకే రూపం ఉన్న ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన ఈ వేడుక ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.














Click it and Unblock the Notifications