ఢిల్లీ సరిహద్దు నిరసనల నుంచి తిరిగివచ్చిన పంజాబ్ యువ రైతు ఆత్మహత్య
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దులో చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిసెంబర్ 18న నిరసనల నుంచి వెనక్కి వచ్చిన 22ఏళ్ల గుర్లబ్ సింగ్ అనే పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బఠిండ జిల్లాలోని దయల్పూర్ మీర్జా గ్రామానికి చెందిన గుర్లభ్ సింగ్ రైతుల నిరసనల్లో పాల్గొని డిసెంబర్ 18న స్వగ్రామానికి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శనివారం నాడు విషం సేవించి తన నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.
వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబంతోపాటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా, గుర్లభ్ సింగ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అయితే, చిన్న రైతు అయిన గుర్లభ్ సింగ్కు రూ. 6 లక్షల బ్యాంకు అప్పు ఉందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానికి సమీపంలో రహదారులపై పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వారికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. సుమారు 30 రోజులకుపైగా ఈ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు. కేంద్రం పంటలకు మద్దతు ధరను అలాగే ఉంచుతామని చెప్పినప్పటికీ.. రైతు సంఘాల ప్రతినిదులు మాత్రం చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. కాగా, డిసెంబర్ 25 రైతు నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.