అమ్మాయిలిద్దరు ప్రేమలో పడ్డారు, పారిపోయి పెళ్లాడారు
బెంగళూరు: ఇద్దరు స్నేహితురాళ్లు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు వారిద్దరు కలిసి చదువుకున్నారు. కలకాలం కలిసే ఉండాలని నిర్ణయించుకున్న వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సంఘటన కర్నాటకలో జరిగింది.
కర్నాటక రాష్ట్రం చెన్నపట్టణ సమీపంలో అబ్బూరుకు చెందిన 21 ఏళ్ల వినుత, గరకహళ్లికి చెందిన 21 ఏళ్ల సుచిత్ర సమీప బంధువులు. బాల్యం నుండి కలిసే విద్యాభ్యాసం సాగించారు.
ఒకే కళాశాలలో పీయూసీ, డిగ్రీ కూడా పూర్తి చేశారు. మొదటి నుండి సన్నిహితంగా మెలగిన వీరు అనంతర కాలంలో ఒకరి ప్రేమలో మరొకరు పడ్డారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరిద్దరు కనిపించకుండా ఇంటి నుండి వెళ్లిపోయారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారి జాడ తెలుసుకున్నారు. సోమవారం ఈ యువతులు ఇద్దరిని పోలీసు స్టేషన్కు తీసుకు రాగా వారు వివాహం చేసుకున్న విషయం చెప్పారు. తల్లిదండ్రులు వివాహాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆ యువతులకు నచ్చజెప్పేందుకు యత్నించినా వారు మాట వినలేదు. ఒకరికి మరొకరం తోడుగా ఉండేందుకు పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.