కొలంబో పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తలు దుర్మరణం: మరో ఆరుమంది మిస్సింగ్
కొలంబో: శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన విధ్వంసం సందర్భంగా జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది అదృశ్యం అయ్యారు. వారి జాడ తెలియరావట్లేదు. ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి ధృవీకరించారు. కొలంబోలో పేలుళ్లలో తమ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృత్యువాత పడ్డారని, మరో ఆరుమంది కనిపించట్లేదని తనకు సమాచారం అందిందని అన్నారు. పార్టీ కార్యకర్తల మృతి తనను కలచివేసిందని చెప్పారు.
ఈస్టర్ నాడు టెర్రర్: 8 చోట్ల మహోగ్రదాడులు: 207 మంది మృతి: వణికిన శ్రీలంక
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీన కర్ణాటకలో తొలిదశ లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. అప్పటిదాకా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జేడీఎస్ పార్టీ కార్యకర్తలు కేజీ హనుమంతరాయప్ప, ఎం రంగప్ప, శివకుమార, లక్ష్మీ నారాయణ, మారే గౌడ, పుట్టరాజు, మరో ఇద్దరు విశ్రాంతి తీసుకోవడానికి రెండురోజుల కిందటే శ్రీలంకకు వెళ్లారు. రాజధాని కొలంబోలో బస చేశారు. షాంగ్రిలా హోటల్ పై ఆత్మాహూతి దాడి సందర్భంగా నేలమంగలకు చెందిన హనుమంతరాయప్ప, కాంట్రాక్టర్ రంగప్ప దుర్మరణం పాలయ్యారు. శివకుమార, లక్ష్మీనారాయణ, మారేగౌడ, పుట్టరాజు సహా మరో ఇద్దరి జాడ తెలియరావట్లేదు.
కొలంబోలో చోటు చేసుకున్న పేలుళ్లలో హనుమంతరాయప్ప, రంగప్ప దుర్మరణం పాలైనట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారి కుటుంబ సభ్యలకూ సమాచారం అందించారు. తమ పార్టీ కార్యకర్తలు కొలంబోలో దుర్మరణం పాలైనట్లు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కుమారస్వామి.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపాన్ని తెలియజేశారు. శ్రీలంకలో పర్యటించడానికి వారు రెండురోజుల కిందటే బయలుదేరి వెళ్లారని, అంతలోనే మృత్యువాత పడ్డారని అన్నారు. గల్లంతైన వారి సమాచారాన్ని సేకరించడానికి తాను ఎప్పటికప్పుడు కొలంబోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నట్లు తెలిపారు.
@SushmaSwaraj
— India in Sri Lanka (@IndiainSL) April 22, 2019
We sadly confirm the deaths of the following two individuals in the blasts yesterday:
- K G Hanumantharayappa
-M Rangappa.