బాదౌన్ రిపీట్: చెట్టుకు వేలాడుతూ అక్కాచెల్లెళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాదౌన్ వంటి ఘటనే చోటు చేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఊరి వెలుపల చెట్టుకు వేలాడుతూ కనిపించారు. శనివారం రాత్రి ఆ రకంగా వారిద్దరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాహ్రైచ్ జిల్లా చందన్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
తాము బహిర్భూమికి వెళ్తున్నామని చెప్పి అక్కాచెల్లెళ్లు రూప (19), సంజు (21) ఇంటి నుంచి బయటకు వెల్లారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరుకోలేదు. వారిద్దరి కోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వారి శవాలు ఉరి వెలుపల చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.
తన భార్యకు ఇంటి పనిలో సహకరించకపోవడంతో వారిద్దరిని సోదరుడు మనోజ్ కొట్టాడని, తన భార్య గర్భవతి కావడంతో ఇంటి పని పూర్తి చేయాలని వారికి చెప్పాడని ఎఎస్పీ అరివింద్ పాండే చెప్పారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ హత్య కోణంలో కూడా పోలీసులు ఆలోచన సాగిస్తున్నారు.
ఇద్దరి శవాలను పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు. అమ్మాయిలపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఏవీ లేవని పోలీసులు చెప్పారు. 2014 మేలో అక్కాచెల్లెళ్లు బాదౌన్ జిల్లాలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే.