యూజీసీ నెట్ డిసెంబర్ 2019 ఫలితాలు విడుదల..అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (NET) ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్పై ఉంచింది. యూజీసీ నెట్ 2019 ఫలితాల కోసం ntanet.nic.in అనే వెబ్సైట్పై అభ్యర్థులు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్టీఏ యూజీసీ నెట్ 2019 కంప్యూటర్ ఆధారిత పరీక్షను డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించింది. మొత్తం 10,34,872 మంది అభ్యర్థులు నెట్ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోగా.. 7,93,813 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్ష 219 నగరాల్లోని 700 కేంద్రాల్లో నిర్వహించారు.
యూజీసీ నెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే రీవాల్యుయేషన్ ఉండదని ఎన్టీఏ పేర్కొంది. యూజీసీ నెట్కు సంబంధించి ప్రొవిజనల్ యాన్సర్ కీని డిసెంబర్ 10వ తేదీన విడుదల చేసింది. సమాధానాలపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు లేదా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు డిసెంబర్ 15 వరకు అభ్యర్థులకు ఎన్టీఏ సమయం ఇచ్చింది. ఇక ఫైనల్ సమాధానాల కీ ఆధారంగానే ఫలితాలను విడుదల చేయడం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల కోసం అర్హత పరీక్షగా నెట్ను ఏటా రెండు సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన వారు దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో కానీ యూనివర్శిటీల్లో కానీ ఫాకల్టీగా ఉద్యోగం సంపాదించొచ్చు. ఈ సారి 60,147 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కోసం అర్హత సాధించగా.. 5092 మంది అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అర్హత సాధించారు.