లోక నాయకుడు కమల్ హాసన్ సంచలనం నిర్ణయం..
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధానికి సమీపించింది. ఈ ఉదయం హర్యానాలో యాత్రను పునఃప్రారంభించిన ఆయన ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వైపు సాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఇది ముగియాల్సి ఉంది.
యాత్రలో పాల్గొన్న..
ఈ తెల్లవారు జామున ఆయన హర్యానాలోని ఫరీదాబాద్లో యాత్రను పునఃప్రారంభించారు. ఢిల్లీకి సమీపిస్తోన్న కొద్దీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటోన్న ప్రముఖల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాహుల్ గాంధీ తల్లి, ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వాళ రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
కోవిడ్ నేపథ్యంలో..
భారత్ జోడో యాత్రలో వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటోన్నారు. ఢిల్లీలో చేరిన అనంతరం ఈ సంఖ్య మరంత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఢిల్లీ దిశగా సాగుతోన్న యాత్ర మార్గంలో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు, బ్యానర్లు విస్తృతంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో-భారత్ జోడో యాత్రను వాయిదా వేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులను పంపించడం ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే.
అనూహ్య మద్దతు..
ఈ పరిస్థితుల మధ్య భారత్ జోడో యాత్రలో లోక నాయకుడు, మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కమల్ హాసన్.. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. దేశ రాజకీయ స్థితిగతులపై చర్చించారు. అనంతరం భోజన విరామం అనంతరం పునఃప్రారంభమైన భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
ప్రభావం చూపని వేళ..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీథి మయ్యం పార్టీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయిన విషయం తెలిసిందే. స్వయంగా కమల్ హాసన్ సైతం ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిని చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
విక్రమ్ సక్సెస్ తో..
ప్రస్తుతం కమల్ హాసన్ తాను నటించిన విక్రమ్ సూపర్ హిట్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. ఈ సంవత్సరం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో టాప్ లో నిలిచిందీ మూవీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 450 నుంచి 500 కోట్ల రూపాయలను వసూలు చేసిందీ మూవీ. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తోన్నారాయన. ఈ మూవీ సెట్స్ పై ఉంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి.