నో వార్.. నో పీస్! ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం, సిద్ధంగా ఉన్నాం: ఐఏఎఫ్ చీఫ్ భదౌరియా
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహాసాలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్ ఎప్పటికప్పుడు వేగంగా స్పందిస్తోందని తెలిపారు.

నో వార్.. నో పీస్
మంగళవారం ఢిల్లీలో ఓ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సరిహద్దులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి భదౌరియా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ‘నో వార్(యుద్ధం లేదు), నో పీస్(శాంతి) లేదు' అనేలా పరిస్థితి నెలకొందని తెలిపారు. తూర్పు లడఖ్లో ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సానుకూల ఫలితాలు రావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం..
పొరుగు దేశం నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురైనా మన సైనిక బలగాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని, ముఖ్యంగా వాయుసేన వెంటనే బదులిస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తుల్లో జరిగే ఘర్షణల్లో మన విజయంలో వాయుసేన కీలక పాత్ర పోషిస్తుందని ఐఏఎఫ్ చీఫ్ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే అంతా సిద్ధం..
రఫేల్ యుద్ధ విమానాలతోపాటు సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్క్రాఫ్ట్, చినూక్, అపాచీ హెలికాప్టర్ల చేరికతో ఐఏఎఫ్ వ్యూహాత్మక సామర్థ్యం మరింత మెరుగైందని తెలిపారు.
ఎప్పటికప్పుడు ఆధునాతన ఆయుధ సాంకేతికతను అందిపుచ్చుకుని నిర్వహించడం అత్యంత ముఖ్యమని అన్నారు. రెండు స్క్వాడ్రన్ల లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్లను చేర్చడం, దేశీయంగా అభివృద్ధి చేసిన కొన్ని ఆయుధాల్ని తక్కువ సమయంలో సుఖోయ్-30 ఎంకేఐకి అనుసంధానించడం వంటి చర్యలు మెరుగవుతున్న దేశీయ సామర్థ్యానికి అద్దం పడుతున్నాయని అన్నారు.

సుమారు లక్ష బలగాల మోహింపు..
కాగా, చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దుల్లోకి భారీ ఎత్తున యుద్ధ సామాగ్రిని, యుద్ధ విమానాలను, యుద్ధ ట్యాంకులను తరలించిన విషయం తెలిసిందే. చైనా సుమారు 50వేల సైనిక బలగాలను సరిహద్దుకు చేర్చినట్లు వచ్చిన సమాచారంతో.. భారత్ ఏకంగా సుమారు లక్ష మంది సైనిక బలగాలను సరిహద్దుల వెంబడి మోహరించింది. అన్ని రకాల యుద్ధ సామాగ్రిని సిద్ధంగా ఉంచింది. దీంతో ఎపుడేం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆటవిక దాడులను సహించమని, అలాంటి చర్యలకు పాల్పడితే కాల్చిపారేస్తామని ఇప్పటికే భారత్.. చైనాకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications