కేంద్ర బడ్జెట్: తగ్గనున్న ఇళ్ల ధరలు, ఆదాయపన్నులో కీలక మార్పులు?
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పైన అందరి చూపు ఉంది. ఈ బడ్జెట్లో పన్నుల భారం ఉండదని, అధిక అదాయం ఉంటే మాత్రం వదిలేలా పరిస్థితులు ఉండవని అంటున్నారు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పైన అందరి చూపు ఉంది. ఈ బడ్జెట్లో పన్నుల భారం ఉండదని, అధిక అదాయం ఉంటే మాత్రం వదిలేలా పరిస్థితులు ఉండవని అంటున్నారు. నోట్ల రద్దు అనంతరం ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్లో పేదలకు ఊరట కలుగవచ్చునని అంటున్నారు.
పన్నురేట్లు తగ్గించాలని ఎకనామిక్ సర్వే సూచించింది. ఆదాయ పన్ను రేట్లను తగ్గించాలని, కార్పొరేట్ పన్ను తగ్గింపునకు కాలపరిమితిని విధించుకోవాలని సిఫార్సు చేసింది. అదే సమయంలో అధిక ఆదాయం ఉన్నవారిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని తెలిపింది.
అధిక ఆదాయ వర్గాలు అంటే ఏమిటో వివరించలేదు. అయితే వ్యవసాయ ఆదాయానికి ప్రస్తుతం మినహాయింపు ఉన్నందున దానినే పన్ను పరిధిలోకి తేవాలన్న అర్థం వస్తోందన్న అభిప్రాయాలు ఉన్నాయి.
పేదరిక నిర్మూలనలో భాగంగా అందరికీ కనీస ఆదాయం ఉండాలని ఆర్థిక సర్వే చెప్పింది. ఉందుకోసం యూనివర్సల్ బేసిక్ ఇన్కం - యూబీఐ పథకాన్ని ప్రవేశ పెట్టాలని సూచించింది.
సాహసంతో ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు పలికినందుకు ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి పన్నుల రూపంలో ఉపశమనం అందిస్తారని సామాన్యులూ, ముఖ్యంగా ఉద్యోగులూ ఆశలు పెట్టుకున్నారు.
పన్నుల వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, గృహ నిర్మాణాల వడ్డీ రేటు తగ్గనున్నాయని, ఉపాధి హామీకి నిధులు పెరగనున్నాయని తెలుస్తోంది. అదాయపన్ను శ్లాబ్స్ మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆదాయపన్నుపై సూచనలు
ఆదాయపు పన్ను ప్రాథమిక మినహాయింపు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచవచ్చునని అంటున్నారు. ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉన్న వారిపై పది శాతం పన్ను విధించవచ్చును.
ప్రస్తుతం ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5లక్షలు ఆదాయం ఉన్న వారికి ఈ పన్నుశాతం వర్తిస్తోంది. ఆదాయం రూ.10 నుంచి రూ.20లక్షల మధ్య ఉన్నవారికి 20 శాతం పన్ను విధించాలని సూచనలు అందాయి. స్టార్టప్లకు కొన్నేళ్లపాటు రాయితీలు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.