బడ్జెట్ బాంబే మిఠాయిలా ఉంది, ప్రజలను మోసం చెయ్యడానికి మోడీ డ్రామాలు: సీఎం కుమారస్వామి !
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాంబే మిఠాయి లాగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. ప్రజలను తాత్కాలికంగా మభ్యపెట్టాలని చూసిన కేంద్ర ప్రభుత్వాన్ని చూసి జాలి వేస్తుందని సీఎం కుమారస్వామి చెప్పారు.
బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కుమారస్వామి కేంద్ర బడ్జెట్ సంపూర్ణంగా విఫలం అయ్యిందని, ఇది ప్రజలకు ఏమాత్రం మేలు చెయ్యదని ఆరోపించారు. ప్రజలను మెప్పించడానికి ప్రయత్నించిన మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కుమారస్వామి అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం 44 లక్షల మంది రైతుల ప్రయోజనం కోసం రూ. 48 వేల కోట్ల రుణమాఫీ చేసిందని కుమారస్వామి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల గురించి ఏం పట్టించుకుందని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు.
సబ్ అర్బన్ రైలు ప్రాజెక్ట్ కు అంగీకరించాలని, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని తన మీద ఒత్తిడి చేశారని, అయితే ఎలాంటి నిధులు కేటాయించలేదని కుమారస్వామి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నించిందని కుమారస్వామి ఆరోపించారు.
కర్ణాటకలో 17 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని, 5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి రాష్ట్రాన్ని ఉద్దరించారని కుమారస్వామి వ్యంగంగా అన్నారు. ఇంత మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయం చెయ్యలేదని కుమారస్వామి ఆరోపించారు.