విపక్షాల ఆందోళన, సభలోనే మోడీ: ఉభయ సభలు వాయిదా
బుధవారం ఉదయం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభకు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: బుధవారం ఉదయం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభకు హాజరయ్యారు. అయితే, మంగళవారం వరకు పెద్దనోట్ల రద్దు అంశంపైనే చర్చకు పట్టుబట్టిన విపక్షాలు ఈ రోజు సరిహద్దు వద్ద భద్రత అంశంపై చర్చించాలని పట్టుబట్టాయి.
నగ్రొటాలో సైనికులపై దాడి ఘటనపై చర్చించాలని కోరుతున్నాయి. రాజ్యసభలో ఇదే అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్షాలు నగ్రొటాపైనే చర్చించాలనుకుంటే తాము ఆ అంశంపైనే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర అర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు.
మరోవైపు లోక్సభలో విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తిరిగి ప్రారంభమైనప్పటికీ.. విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. మోడీ నిరంకుశత్వం నశించాలంటూ నినాదాలు చేశారు.
తాము స్పీకర్కు వ్యతిరేకంగా విమర్శలు చేయడం లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే విమర్శలు చేస్తున్నామని చెప్పారు. తాము హంగామా కోసం ఆందోళన చేయడం లేదని సీపీఎం సభ్యులు తెలిపారు.
నల్లధనంపై ఓటింగ్ పేరుతో సభను విభజించడం సరికాదని అనంతకుమార్ అన్నారు. కాగా, నిబంధనలను పక్కన పెట్టి చర్చ జరపాలని స్పీకర్ పేర్కొన్నారు. అయితే, విపక్షాల ఆందోళనతో మరోసారి లోకసభ వాయిదా పడింది.
ఇది ఇలా ఉండగా, ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఏపికి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని లోకసభలో డిమాండ్ చేశారు. రెండు నెలలు గడిచినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు.
కాగా, రాజ్యసభలో విపక్ష సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకువచ్చి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దనోట్ల రద్దు, నగ్రొటాలో సైనికులపై దాడి అంశాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో వీరమరణం పొందిన సైనికులతో పాటు నోట్ల రద్దు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి గురించి కూడా సభలో చర్చించాలని డిమాండ్ చేశారు.
ఉగ్రదాడుల అంశాన్ని రాజకీయం చేయకూడదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మరోవైపు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సభలో ఏ అంశం గురించైనా చర్చించడానికి సిద్ధమేనని చెప్పారు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.