అందరూ మల్టీ మిలియనీర్లు.. బాహుబలులే..
ఏడు జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 635 మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే వారిలో 126 మందికి నేరాలతో సంబంధం ఉన్నదని తేలింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ గెలుపే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. నేరస్థ రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తామని కబుర్లు చెప్పే వివిధ పార్టీల అధినేతలు ఆచరణలో కరుడు గట్టిన నేరగాళ్లకే టిక్కెట్లు కేటాయిస్తుండటం గమనార్హం. అయితే ఇప్పటివరకు జరిగిన ఐదు దశల పోలింగ్ ఒక ఎత్తు.
శనివారం జరుగనున్న పోలింగ్ మరొక ఎత్తు. ఏడు జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 635 మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే వారిలో 126 మందికి నేరాలతో సంబంధం ఉన్నదని తేలింది. అభ్యర్థులు ప్రకటించిన అఫిడవిట్లే ఆ విషయం చెప్తున్నాయి. అంటే 20 శాతం మంది అభ్యర్థులు నేరాలకు పాల్పడినట్లు తేలిపోయింది. వారు హత్య, హత్యాయత్నం, అత్యాచారం, కిడ్నాప్, మహిళలపై దాడులు తదితర తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు.
వారిలో బీఎస్పీ నుంచి 'మౌ' నుంచి బరిలో దిగిన ముఖ్తార్ అన్సారీ పేరుమోసిన గూండా. బీఎస్పీ అధినేత మాయావతి.. ముఖ్తార్ అన్సారీకి మద్దతుగా జరిగిన ప్రచారసభలో మాట్లాడుతూ 'బాహుబలి' ముఖ్తార్ అన్సారీకి భారీగా ఓట్లేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఆయనతోపాటు బ్రిజేష్ సింగ్, మున్నా బజరంగి కూడా జైళ్లలోనే మగ్గుతున్నారు. కాకపోతే ముఖ్తార్ అన్సారీ మాత్రం ఆరోగ్య కారణాల పేరిట పెరోల్ పై బయటకు వచ్చారు. ముఖ్తార్ తోపాటు మిగతా వారి బంధుగణం తమ వారి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

మూడు పార్టీలు ఇలా..
మౌ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ముఖ్తార్, బ్రిజేష్ సింగ్ మేనల్లుడు సుశీల్ సింగ్.. చందౌలీ లోక్ సభ స్థానంలోని సాయాద్రాజా స్థానం నుంచి బీజేపీ టిక్కెట్, జాన్ పుర్ జిల్లాలోని సిర్యాహు స్థానం నుంచి అప్నాదళ్ నేత మున్నాబజరంగి అభ్యర్థిత్వం సంపాదించారు.

కళంకిత నేతలిలా..
వీరితోపాటు పలువురు కళంకిత నేతలు ఎన్నికల బరిలో నిలవడంతో 49 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 24 నియోజకవర్గాల్లో పోలీసులు, ఎన్నికల సంఘం ‘రెడ్ అలర్ట్' ప్రకటించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రతి నియోజకవర్గంలోనూ ముగ్గురు, అంతకంటే ఎక్కువ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. మౌతోపాటు గోరఖ్పూర్లోని సహజాన్వా, బాలియాలోని బాన్దిహ్, ఖుషీనగర్ జిల్లా పరిధిలోని ఫాజిల్ నగర్ నియోజకవర్గాల్లో ఆరుగురు చొప్పున అభ్యర్థులు క్రిమినల్ నేరాలకు పాల్పడినట్లు రికార్డులు చెప్తున్నాయి.

కోటీశ్వర్లు, క్రిమినల్స్కే బీఎస్పీ పెద్దపీట
బీఎస్పీలోనే అత్యధికంగా క్రిమినల్స్, కోటీశ్వరులకు టిక్కెట్లు దక్కాయి. 49 మంది అభ్యర్థుల్లో 24 (49%) మంది నేరాభియోగాలు ఎదుర్కొంటుండగా, 33 మంది (73%) అభ్యర్థులు కోటీశ్వర్లు. నేరగాళ్లు, సంపన్నులకు టిక్కెట్లిచ్చిన పార్టీల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 18 (40%) మంది నేరస్తులు, 28 (70%) మంది మల్టీ మిలియనీర్లు బీజేపీ అభ్యర్థులు కాగా, అధికార సమాజ్ వాదీ పార్టీ 15 (38%) మంది నేరస్తులు, 28 (70%) మంది సంపన్నులకు టిక్కెట్లు కేటాయించింది.

బీఎస్పీలోనే సంపన్నులు ఇలా..
సంపన్నుల్లో టాప్ -3లోనూ బీఎస్పీ అభ్యర్థులే నిలిచారు. ముబారక్ పూర్ అభ్యర్థి షా ఆలం అకా గుడ్డు జమాలీ తన ఆస్తులు రూ.118 కోట్లని ప్రకటించగా, గోరఖ్ పూర్ జిల్లాలోని చిల్లూపర్ అభ్యర్థి, డాన్ హరిశంకర్ తివారీ కుమారుడు వినయ్ శంకర్ తివారీ తన అఫిడవిట్ లో రూ.67 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. మహరాజ్గంజ్ జిల్లాలోని నౌతాన్వా అభ్యర్థి అయిజాజ్ అహ్మద్ ఆస్తులు రూ.52 కోట్లు. గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీపై అత్యధికంగా హత్య కేసులు నమోదు కాగా, ఆయన ఆస్తుల విలువ రూ.6 కోట్ల పై మాటే. మరి ఓటర్లు వీరిలో ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారో వేచి చూడాల్సిందే మరి.












Click it and Unblock the Notifications