యూపీలోనూ కరోనా ఉధృతి: ఒక్క రోజులోనే 15,353 కరోనా కేసులు
లక్నో: దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
తాజాగా, ఒక్క రోజు వ్యవధిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 15,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గవర్నర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అఖిలపక్ష నేతలతో సమావేశమై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, ఆరోగ్యమంత్రి జైప్రతాప్ సింగ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), అప్నా దల్ షెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం 15,353 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 67 మంది కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 71,241 యాక్టివ్ కేసులున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో అత్యధికంగా 4444 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నగరంలో గత 24 గంటల్లో 31 మంది కరోనాతో మరణించారు. ఆదివారం యూపీలో 2,03,780 కరోనా నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు 3,67,61,069 నమూనాలను పరీక్షించారు.
కాగా, భారతదేశంలో తాజాగా, 1.52 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.33 కోట్లకు చేరింది. గత 24 గంటల్లో 839 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 1,69,275కు చేరింది.












Click it and Unblock the Notifications