శబరిమల గుడ్న్యూస్: డిసెంబర్ 20 నుంచి 5 వేల మంది భక్తులకు అనుమతి
శబరిమల: డిసెంబర్ నెల నుంచి జనవరిలో వచ్చే సంక్రాంతి పర్వదినం వరకు సాధారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకుంటారు. కానీ, ఈసారి మాత్రం కరోనా మహమ్మారి కారణంగా కేరళ ప్రభుత్వం విధించిన నిబంధనల నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలోనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
పరిమిత సంఖ్యలోనే భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాగా, శనివారం కేరళ హైకోర్టు భక్తులకు శుభవార్తను అందించింది. అయ్యప్ప దర్శనానికి అనుమతించే రోజువారీ భక్తుల సంఖ్యను పెంచుతూ ఆదేశాలిచ్చింది. డిసెంబర్ 20 నుంచి రోజూ 5 వేల మంది భక్తులను అనుమతించాలని ట్రావెన్కోర్ దేవస్యం బోర్డును ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.

కాగా, నవంబర్ 16 నుంచి భక్తులను శబరిమలపైకి అనుమతిస్తున్నారు. మొదట రోజుకు 1000 మంది, శని, ఆదివారాల్లో 2 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించారు.
ఇటీవలే ఆ సంఖ్యను సాధారణ రోజుల్లో 2 వేలు, వారంతాల్లో 3 వేలకు పెంచారు. తాజాగా రోజుకు 5వేల మందిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.
నవంబర్ 16 నుంచి భక్తుల సందర్శన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 300 మందికిపై కరోనా బారినపడ్డారు. వీరిలో శబరిమల అర్చకులు, సిబ్బంది, పోలీసులు, భక్తులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిబంధనలను ఆలయ యాజమాన్యం, ప్రభుత్వం కఠినతరం చేసింది. శబరిమలకు వచ్చే వారు ముందుగానే కరోనా పరీక్షలు చేసుకుని నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకుని రావాలని స్పష్టం చేసింది. ఆ రిపోర్టు 48 గంటలలోపు చేసిందై ఉండాలని తెలిపింది.
కాగా, డిసెంబర్ 26న శబరిమలలో మండల పూజ జరగనుండగా, జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తుల భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. జనవరి 20 తర్వాత శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నారు.












Click it and Unblock the Notifications