లాక్డౌన్ సడలింపు -పగలంతా షాపులు -ఆలయాలకు 5గురే -స్కూళ్లు బంద్ -నైట్ కర్ఫ్యూ కొనసాగింపు
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో యోగి సర్కార్ లాక్డౌన్ నిబంధనలను సడలించింది. అయితే, రాత్రి పూట కర్ఫ్యూను మాత్రం యథావిథిగా కొనసాగించాలని నిర్ణయించింది. దేశంలోనే అత్యధిక రికవరీరేటు, అతి తక్కువ పాజిటివిటీ రేటుతో యూపీ కొవిడ్ నిర్వహణలో మెరుగ్గా ఉందని ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు. లాక్ డౌన్ సడలింపులు, వేటికి అనుమతి, వేటికి లేదు తదితర వివరాలను ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది..
సాయంత్రం 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూను కొనసాగిస్తూనే, పగటిపూట రిలాక్సేషన్లు ప్రకటించారు. 600 కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్న జిల్లాల్లో జూన్ 1 నుంచి లాక్ డౌన్ ఎత్తేస్తున్నట్లు యూపీ సర్కారు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 75 జిల్లాలు ఉండగా, 55 జిల్లాల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 600కు దిగువన ఉన్నాయి. సడలింపుతో మంగళవారం నుంచి ఆయా జిల్లాల్లో పగటిపూట ఎలాంటి ఆంక్షలు ఉండవు. అయితే, రాజధాని లక్నో సహా 20 జిల్లాల్లో యాక్టివ్ కేసులు 600 కంటే ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ యథావిథిగా కొనసాగనుంది. సడలింపులు ఇచ్చిన జిల్లాల్లో కేసులు మళ్లీ 600 దాటినట్లయితే తిరిగి లాక్ డౌన్ విధిస్తామని ప్రభుత్వం తెలిపింది.

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అన్ని రకాల దుకాణాలను పగటి పూట అంతా తెరుచుకునే వీలుంది. అన్ని ఆలయాల్లో ఒకసారి ఐదు గురికంటే ఎక్కువ భక్తులను అనుమతించరు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పనిచేసుకోవచ్చు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలన్నీ మూసేసి ఉంచుతారు. ఆన్ లైన్ విద్యా బోధనపై త్వరలోనే గైడ్ లైన్సు జారీ చేయనున్నారు. రెస్టారెంట్లలో టేక్ అవే(పార్సిళ్లకు) మాత్రమే అనుమతిచ్చారు. హైవేలపై దాబాలు, హోటళ్లు కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలి.

యూపీలో శనివారంనాడు కొత్తగా 2,287 కేసులు వచ్చాయి. తద్వారా మొత్తం కేసులు 16,88,152కు మరణాల సంఖ్య 20,208కి పెరిగింది. దేశంలోనే అత్యధికంగా 96.10 రికవరీ రేటు యూపీలో కొనసాగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 41,000లకు తగ్గినట్లు సీఎం యోగి చెప్పారు.












Click it and Unblock the Notifications