కాశ్మీర్ పై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్.. పాకిస్తాన్ కు బిగ్ షాక్..!
దశాబ్దాలుగా భారత్ లో కాశ్మీర్ అంతర్భాగంగా ఉన్నా, అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే పాలిస్తున్నా.. ఈ ప్రాంతం తమదే అంటూ అంతర్జాతీయ వేదికలపై చెప్పుకునే పాకిస్తాన్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor)జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ భారత్ లో ఓ ముఖ్యమైన అంతర్భాగమని సెర్గియో గోర్ తేల్చిచెప్పేశారు. దీంతో పాటు కాశ్మీర్ కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు, పహల్గాం దాడుల తర్వాత ఒక అమెరికా రాయబారి శ్రీనగర్ కు రావడం ఇదే తొలిసారి. ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉందని, ఇది భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగమని సెర్గియో తెలిపారు. తాను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అని, ఇది అద్భుతమైన అందమైన ప్రదేశమని కితాబిచ్చారు. ఇక్కడ ఉండటం, ఈ ప్రదేశాన్ని చూడటం తనకు చాలా ఉత్సాహాన్నిస్తోందన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా విధించిన అత్యున్నత స్థాయి ప్రయాణ హెచ్చరికను తగ్గించడంపై పునరాలోచిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉగ్రవాద ముప్పు కారణంగా జమ్మూ కాశ్మీర్ పై అమెరికా లెవల్ 4 అంటే ప్రయాణించవద్దనే హెచ్చరికను అమలు చేస్తోంది. దీన్ని తగ్గిస్తామని సెర్గియో హామీ ఇచ్చారు.

గోర్ పర్యటనకు ముందే, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. ఈ లోయలోని వేలాది కుటుంబాలు జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అమెరికా తమ కఠినమైన ప్రయాణ హెచ్చరికను సమీక్షించి ఉపసంహరించుకోవాలని ఆయన్ను కోరారు. మరోవైపు సెర్గోయో గోర్.. రేపు లడఖ్లో పర్యటిస్తారు. 2020 నాటి గల్వాన్ ఘర్షణ, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత, ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్న తొలి అమెరికా రాయబారి ఆయనే. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అక్కడి సైన్యం అరాచకాలకు వ్యతిరేకంగా స్థానికులు హింసాత్మక నిరసనలు చేపట్టి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో సెర్గోయో గోర్ పర్యటన, వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














Click it and Unblock the Notifications