యుపి ఎన్నికలు: మోడీ స్పీచ్ దేనికి సంకేతం?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కమలనాథుల్లో నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సోమవారం ‘మౌ’లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలే .
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథుల పరిస్థితి నల్లేరు మీద నడక కాదని అనిపిస్తోంది. సోమవారం 'మౌ'లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి తమ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకు పూనుకున్నాయని, అందుకు కొత్త మార్గం ఎంచుకున్నాయని ఎదురు దాడి కి దిగారు. ఎస్పీ, బీఎస్పీలకు ఆ పార్టీలు గెలవలేమని అర్థమై పోయిందని, దీంతో ఎవరికీ మెజారిటీ రాకుండా చూడాలని కొత్త గేమ్ ప్లాన్కు తెర తీశాయన్నారు.
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాడు ప్రధాని నరేంద్రమోదీ మొదలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వరకు ప్రతి ఒక్కరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని ప్రగాడ విశ్వాసం వ్యక్తం చేశారు.
300లకు పైగా స్థానాలను గెలుచుకుంటుందని ధీమాగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ - సమాజ్ వాదీ పార్టీ కూటమి తమ విజయంపై ఎటువంటి ప్రభావం చూపబోదని నమ్మకంగా చెప్పారు. కానీ నాలుగు దశల పోలింగ్ ముగుస్తుండగా 'మౌ'లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ 'త్రిశంకు సభ' ఏర్పాటుకు ఎస్పీ, బీఎస్పీ కుట్ర పన్నాయని పదేపదే ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంతో కమలనాథుల్లో ఆత్మరక్షణ ధోరణి వ్యక్తమవుతున్నదా? అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండున్నరేళ్లుగా అభివ్రుద్ది పనులేమీ చేపట్టకపోగా, పెద్ద నోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైందని కమలనాథులు వాస్తవ పరిస్థితులను గమనించిన తర్వాత విజయావకాశాలు తగ్గాయని తమ నిర్ణయానికి ప్రజలిచ్చే తీర్నని ప్రజలు భావిస్తున్నారని తెలుస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు తమకు సెమీ ఫైనల్స్ అని, 2019 లోక్ సభ ఎన్నికలు షైనల్స్ అని భావించిన కమలనాథులకు నోట్ల రద్దు పరీక్షగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ గెలుపుపై గట్టి నమ్మకం ఉంటే ప్రధాని పదేపదే త్రిశంకు అసెంబ్లీ ప్రస్తావనే తెచ్చే వారు కాదని అంటున్నారు.
గతవారం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక ఆంగ్ల టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ విజయావకాశాలను కాంగ్రెస్ - ఎస్పీ పొత్తు దెబ్బ తీస్తున్నదని అంగీకరించారు. కానీ ఎన్నికల్లో తమదే విజయమని నమ్మ బలికారు. కూటమి లేకుండానే 300 స్థానాలకుపైగా గెలుచుకుంటామని, ప్రస్తుతం ఆమోదయోగ్యమైన ఆధిక్యం సాధిస్తామన్నారు.
ముస్లింలకు టిక్కెట్ల నిరాకరణపై ఫిర్యాదులు
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో ముస్లిం నేతలకు టిక్కెట్లు ఇవ్వాల్సిందన్న వాదన కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు ముందుకు తెస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ ముస్లింలకు కేటాయించలేదు. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 20 శాతం. పశ్చిమ యూపీ బెల్టులోని 143 స్థానాల పరిధిలో 20% నుంచి ఆ పైనే ముస్లింల జనాభా ఉంది. తొలుత ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం వల్ల విజయావకాశాలు దెబ్బ తింటాయని స్వయంగా హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముందుకు తెచ్చారు.
మరో మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ అతిపెద్ద రాష్ట్రంలో ముస్లింలకు టిక్కెట్లు కేటాయించకపోవడం విజయావకాశాలను దెబ్బ తీస్తుందని అంగీకరించారు. ఒకవేళ పార్టీ విజయం సాధిస్తే శాసనమండలిలో వారికి గణనీయ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించకపోవడానికి కారణాలు మాత్రం నఖ్వీ వెల్లడించలేదు.
మరో కేంద్ర మంత్రి ఉమా భారతి సైతం ఈ వాదనను ముందుకు తెచ్చారు. ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం సరికాదని, రాజ్ నాథ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై అమిత్ షా, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య తదితరులతో సంప్రదిస్తానని పేర్కొనడం గమనార్హం.