విషాదం: వధువొస్తుండగానే పెళ్ళి పీటలపైనే వరుడి మృతి, ఏమైందంటే?
లక్నో: మరికొద్దిక్షణాల్లోనే వివాహం జరగాల్సి ఉండగా పెళ్ళి పీటలపైనే వరుడు మరణించాడు. వివాహం సందర్భంగా పెళ్ళికి వచ్చిన వరుడి మిత్రుడు సరదాగా జరిపిన కాల్పుల్లో వరుడు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన వరుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో పెళ్ళిళ్ళ సందర్భంగా తుపాకులతో కాల్పులు జరపడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ విధానాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, ఈ తరహ ఘటనలు ఇంకా చోటు చేసుకొంటూనే ఉన్నాయి.
మరికొన్ని క్షణాల్లో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన వరుడు ప్రాణాలు కోల్పోవడం పెళ్ళింట్లో విషాదాన్ని నింపింది. అయితే పెళ్ళి సందర్భంగా ఏర్పాటు చేసిన మైక్ సెట్ కారణంగా తూటా తగిలిన శబ్దం కూడ విన్పించలేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
పెళ్ళి పీటలపైనే వరుడి మృతి
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలోని రామ్పూర్లో పెళ్ళీ పీటలపైనే వరుడు సునీల్ వర్మ మృత్యువాతపడ్డారు. పెళ్ళి తంతు జరుగుతున్న సమయంలోనే సరదాగా వరుడి మిత్రుడు తుపాకీని పేల్చడంతో బుల్లెట్ సరాసరి వరుడి ఛాతీలోకి దూసుకెళ్ళింది. పెళ్ళీ పీటలపైనే వరుడు కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళగా వరుడికి బుల్లెట్ తగిలి మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.
మైక్ కారణంగా విన్పించని తుపాకీ సౌండ్
ఈ వివాహం సందర్భంగా వధువు ఇంటి వద్ద మైక్లో పెద్ద సౌండ్తో పాటలను వింటున్నారు. వివాహన్ని పురస్కరించుకొని వధువు, వరుడి కుటుంబాలకు చెందిన బందువులు, స్నేహితులు ఉల్లాసంగా ఉన్నారు. కొందరు మద్యం సేవించి పెళ్ళి ఇంట్లో సరదాగా గడిపారు. అయితే ఇదే సమయంలో ఈ ఆనందాన్ని వరుడి మిత్రుడు తుపాకీ పేల్చి సంబరాలు చేసుకోవాలనుకొన్నాడు. తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఎటువైపు కాల్చాడో అర్ధం కాలేదు. ఆ తూటా నేరుగా వరుడి ఛాతీలోకే దూసుకెళ్ళింది. పెద్ద సౌండ్తో మైక్ ఉన్న కారణంగా తుపాకీ పేల్చిన శబ్దం విన్పించలేదు.
పీటలపైనే కుప్పకూలిన వరుడు
పెళ్ళి పీటలపైనే వరుడు సునీల్ వర్మ కుప్ప కూలిపోయాడు. పురోహితుడు సునీల్ వర్మతో పెళ్ళి తంతు నిర్వహిస్తున్నాడు. మరికొన్ని క్షణాల్లో వధువు కూడ పెళ్ళి మంటపంలోకి రావాల్సి ఉంది. ఆ సమయంలోనే ఛాతీని పట్టుకొని వరుడు కుప్పకూలిపోయాడు. అయితే వరుడు ఒక్కసారిగా పెళ్ళి పీటలపై కుప్పకూలిపోవడంతో పెళ్ళి మండలంలో ఉన్నవారంతా షాక్కు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తే బుల్లెట్ తగిలి వరుడు మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
నిందితుడి కోసం గాలింపు
పెళ్ళి జరుగుతోందనే సంతోషంతో ఉన్న రెండు కుటుంబాల్లో వరుడు సునీల్ వర్మ మృతి విషాదాన్ని నింపింది. వరుడి తండ్రి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్ళి మండపంలోనే వరుడు కుప్పకూలడంతోనే నిందితుడు పారిపోయాడు.