చరిత్రలో ఎవరూ చేయని పని.. ఓడిపోయాక కూడా ఇలా, ఆమెకే చెల్లింది..
చెన్నై : ఓటమి పాఠాలంటే ఇవే కాబోలు.. గెలుపును ఓటమిని సమదృష్టితో స్వీకరిస్తామని చాలామంది నేతలు ఆయా సందర్భాల్లో స్పీచులు దంచేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఆచరణలో ఎంతమందికి సాధ్యమవుతుంది. అయినా, అప్పటిదాకా జరిగిన ప్రచారంలో గెలుపు మాదంటే మాదేనని కుండబద్దలు కొట్టి, తీరా ఫలితం బోల్తా కొట్టడంతో ఓటమిని మూట గట్టుకున్నాక ఎలా తలెత్తుకు తిరగగలం అని భావిస్తుంటారు చాలామంది.
కానీ ఇందుకు భిన్నంగా, తనను ఓడించినా సరే.. నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే పనిలో పడిపోయారు బీజేపీ తమిళ నేత వానతీ శ్రీనివాసన్. విజయ యాత్ర తరహాలో టాపు లేని జీపులో ప్రయాణిస్తూ.. ఓటర్లకు అభివాదం చేస్తూ, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ ఈ ఓటమి యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ నెల 20వ తేదీ నుంచి ఓటమి యాత్రకు శ్రీకారం చుట్టిన వానతీ శ్రీనివాసన్ నియోజకవర్గంలోని ఒక్కో వీధికి వెళ్లి మరీ తను ఓడిపోయినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదే విషయమై వానతీ శ్రీనివాస్ ను ఆరా తీయగా, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయినప్పటికీ తనకి ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె 33,113 ఓట్లు పొందారు.
ఓడిపోయానని తాను ప్రజలకు దూరంగా ఉండబోనని, ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యల గురించి తెలిపేందుకు తన కార్యాలయానికి రావచ్చునని తెలియజేశారు.