మళ్లీ విజయ్ వర్సెస్ గవర్నర్ : తమిళ గీతానికి అవమానం- బాయ్ కాట్ చేసిన మంత్రి..!
తమిళనాడులో గతంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో గవర్నర్ కూ, టీవీకేకూ మధ్య నెలకొన్న వివాదాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి తమిళ రాష్ట్ర గీతాన్ని కాదని వందే మాతరం (Vande Mataram), జనగణమన పాటల్ని ముందుగా ఆలాపించాలంటూ గవర్నర్ (governor) జారీ చేసిన ఉత్తర్వు వివాదాస్పదమైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా ఓ అధికారిక కార్యక్రమాన్ని విజయ్ ప్రభుత్వంలో మంత్రి, ఎమ్మెల్యేలు బహిష్కరించడం కలకలం రేపుతోంది.
మనోన్మణీయం సుందరనార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలో తమిళ రాష్ట్ర గీతమైన 'తమిళ్ తాయి వాజ్తు'ను వందేమాతరం, జనగణమన తర్వాతే ఆలపించాలంటూ గవర్నర్ కార్యాలయం కచ్చితంగా స్పష్టం చేసింది. దీంతో వందేమాతరం గీతాన్ని మొదట, ఆ తర్వాత జాతీయ గీతాన్ని, చివరిగా మూడో స్థానంలో తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. లోక్ భవన్ నుంచి అందిన ఉత్తర్వుల మేరకు తాము ఈ విధంగా పాటల వరుస క్రమాన్ని మార్చి అమలు చేశామని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎన్.చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఈ చర్య తమిళ భాషా గుర్తింపును, గౌరవాన్ని తగ్గించేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

తమిళ రాష్ట్ర గీతానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.విశ్వనాథన్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు విశ్వవిద్యాలయ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తమిళ గీతాన్ని రాసిన ప్రొఫెసర్ పి.మనోన్మణీయం సుందరం పిళ్లై పేరు మీదుగా ఏర్పాటైన విద్యాసంస్థలోనే ఈ ఘటన జరగడం ఇక్కడ మరో విశేషం. తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను అవమాపరిచేలా వ్యవహరించడం సమంజసం కాదని మంత్రి విశ్వనాథన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి తమిళనాడులో దశాబ్దాలుగా రాష్ట్ర గీతానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని మార్చడంపై లెఫ్ట్ పార్టీలతో పాటు పీఎంకే కూడా ఆగ్రహంగా ఉంది. తమిళుల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చిచెప్పింది.












Click it and Unblock the Notifications