వెరవల్ వయొలెన్స్, వీడియో వైరల్, ఇరు గ్రూపులపై కేసులు
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ మరునాడు కూడా గొడవలు జరిగాయి. గుజరాత్లో గల ఖాంబట్, హిమ్మత్ నగర్ అల్లర్లతోపాటు కోస్తా పట్టణం వెరవల్లో ఆదివారం కూడా రెండు గ్రూపులు గొడవకు దిగాయి. దర్గా పైన కాషాయ జెండా పాతడానికి ఒక వర్గం యత్నిస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది మరో వర్గం.. అదేవిధంగా స్పందించింది. ఇరు వర్గాలు ఫేస్ టు ఫేస్ ఎదురై ఘర్షణకు దిగారు.
అనుమతి లేదని..
పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా అనుమతి లేకుండా ఊరేగింపు తీశారని ఇద్దరు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగిన్ బుటి, అతని సోదరుడు హితేశ్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. మరో కేసు ఆదివారం రోజున నమోదు చేశారు. దర్గా పైకి ఎక్కి కొందరు కాషాయ జెండా (వస్త్రం) ధరించేందుకు కారణం అయిన దర్గా కేర్ టేకర్ కదర్షా మహమ్మద్ అమిన్ షామదార్ మీద కేసు ఫైల్ చేశారు.
వీడియో రావడంతో..
మత విద్వేషాలకు పాల్పడ్డారని మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇరు గ్రూపులు మాలియా కాట్ వద్ద ఘర్షణకు దిగారు. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. వైరల్ వీడియో గురించి తమకు సమాచారం అందిందని ఎస్పీ గిర్ సోమనాత్ తెలిపారు. ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఒకరినీ ఇప్పటికే అరెస్ట్ చేశామని వివరించారు. షేర్ చేసిన వీడియో వల్ల ఇరు వర్గాలు గొడవకు దిగేందుకు సిద్దపడగా.. పోలీసులు వెంటనే స్పందించారు.
హస్తినలో ఇలా..
ఇటు ఢిల్లీలో జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో హింస చెలరేగింది. కొంతమంది పోలీసులకు గాయాలు కాగా, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. జహంగీర్ పూరి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా హింస చెలరేగడంతో ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జహంగీర్ పూరి ప్రాంతంలో భారీగా పోలీసుల్ని మొహరించారు. రెండు వర్గాల మధ్య హింస చెలరేగిందని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.