డేరా బాబాపై వాజ్పేయికి బాధితురాలి లేఖ: మోడీ హయాంలో శిక్ష, బాధితురాలు ఏమన్నారంటే?
2002లో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున..
న్యూఢిల్లీ: 2002లో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున.. ఒకటి తర్వాత మరొకటి అనుభవించేలా(మొత్తం 20ఏళ్లు) సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై డేరా బాబా బాధితురాలు స్పందించారు. తనకు న్యాయం జరిగిందని చెప్పారు.
పదేళ్ల జైలు శిక్ష: జడ్జీ ముందు బోరుమన్న డేరాబాబా, భగ్గుమన్న సిర్సా, 2రాష్ట్రాల్లో హైఅలర్ట్
నాటి ప్రధాని వాజ్పేయికి లేఖ
డేరాబాబా జరిపిన అత్యాచారంపై నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, పంజాబ్-హర్యానా హైకోర్టుకు ఆమె పదిహేనేళ్ల క్రితం రాసిన లేఖే ఆలస్యంగానైనా బాబాకు శిక్ష పడేలా చేసింది. ఈ మేరకు నాటి చేదు అనుభవాలను బాధితురాలు తన బంధువుల ఫోను ద్వారా మీడియాతో పంచుకున్నారు.
భయపడలేదు..
‘2009లో గుర్జీత్ బాబాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు నేను కోర్టుకు హాజరయ్యాను. అప్పుడు కూడా నేను భయపడలేదు. ఇప్పుడూ భయపడటం లేదు' అని బాధితురాలు తెలిపారు.
అప్పుడే సీబీఐ దర్యాప్తునకు ఆదేశం.. కానీ,
ప్రస్తుతం బాధితురాలు 40వ పడిలో ఉన్నారు. 2002 నుంచి ఆమెకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఆ ఏడాదే ఆమె రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న పంజాబ్, హర్యానా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 18 మంది మహిళల నుంచి సీబీఐ సాక్ష్యం తీసుకున్నప్పటికీ సాక్ష్యం చెప్పేందుకు కోర్చుకు వచ్చిన వారు మాత్రం ఇద్దరే.
న్యాయం జరిగింది..
'అవును నాకు ఈరోజు న్యాయం జరిగింది' అంటూ డేరా బాబాకు శిక్ష ప్రకటించగానే బాధితురాలు హర్షం వ్యక్తం చేసింది. కాగా, బాధితురాలి గురించి ఆమె సన్నిహిత బంధువు ఒకరు మరిన్ని వివరాలు తెలిపారు. కాగా, వాజ్పేయి ప్రభుత్వ హాయంలో దర్యాప్తు ప్రారంభమైన ఈ కేసులో మోడీ ప్రభుత్వ హయాంలో తీర్పు రావడం గమనార్హం.
బాధితురాలు చదువుతున్న రోజుల్లోనే ఘాతుకం..
డేరా సచ్చా సౌదా సిర్సా హెడ్క్వార్టర్స్లో కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఆమెపై (బాధితురాలు) డేరా బాబా అత్యాచారానికి పాల్పడ్డారని, ప్రస్తుతం ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.
బాధితురాలి సోదరుడి హత్య వెనుక బాబా
డేరా చీఫ్ అనుచరుడైన బాధితురాలి పెద్ద సోదరుడు హత్య వెనుక కూడా రామ్ రహీమ్ సింగ్ హస్తమే ఉందని బాధితురాలి బంధువు ఆరోపించారు. ‘2002లో బాధితురాలి సోదరుడు హత్యకు గురయ్యాడు. నాటి గుర్తుతెలియని లేఖను అతనే పంపాడని గుర్మీత్ బాబా అనుమానించేవాడు. హత్యకు సంబంధించి బాబాపై కేసు కూడా నమోదైంది. తన చెల్లెలిపై అత్యాచారం జరుగుతున్న విషయం ఆమె సోదరుడికి కూడా తెలుసు' అని ఆయన చెప్పారు.
బాధితురాలి తండ్రి మరణం
డేరాబాబాపై 2009లో కోర్టు ముందు సాక్ష్యం చెప్పేందుకు ఒకే ఒకసారి బాధితురాలు కోర్టుకు వెళ్లిందని, అప్పుడు ఆయనతో పాటే వెళ్లిన ఆమె తండ్రే ఆ తర్వాత విచారణ ముందుకు హాజరయ్యారని, గత ఏడాది ఆయన కూడా కన్నుమూశాడని బాధితురాలి బంధువు తెలిపాడు.
తీర్పు వెలువడిన రోజు టీవీ ముందే బాధితురాలు..
సోమవారం జైలుశిక్షపై తీర్పు సమయంలో బాధితురాలు ఉదయం నుంచి టీవీ వద్దే ఉందని, వ్యవసాయకుటుంబానికి చెందిన ఆమె సిర్సా హెడ్క్వార్టర్స్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక రైతునే పెళ్లాడిందని బాధిరాలి బంధువు తెలిపారు.
హత్య కేసుపై సెప్టెంబర్ 16న విచారణ
ఏదిఏమైనా తనపైన, తన సాటి మహిళలపైన అత్యాచారం జరిగిన విషయాన్ని ధైర్యంగా బయటపట్టి డేరా బాబాకు గుణపాఠం చెప్పిన బాధితురాలు చరిత్ర సృష్టించిందని, ఆమెకు ప్రభుత్వ రివార్డు దక్కాలని ఆయన అన్నారు. కాగా, బాధితురాలి సోదరుడి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు కేసు తుది విచారణ సెప్టెంబర్ 16న కోర్టు ముందుకు రానుంది. ఈ కేసులో కూడా దోషిగా తేలితే అతనికి శిక్ష కాలం పెరిగే అవకాశం ఉంటుంది.