డుమ్మా: ఈడికి మాల్యా మూడోసారి టోకరా
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మూడోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి టోకరా ఇచ్చారు. శనివారం నాడు మూడోసారి ఆయన ఈడి ముందు గైర్హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో తనకు మే వరకు సమయం ఇవ్వాలని ఆయన ఈడిని కోరారు.
విజయ్ మాల్యా 900 కోట్ల రూపాయల రుణ కుంభకోణంలో చిక్కుకున్న వ్యవహారంపై ఈడి విచారణ జరుపుతోంది. తమ ముందు ఏప్రిల్ 9వ తేదీన హాజరు కావాలని ఈడి మూడో సారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇంతకు ముందు రెండు సార్లు కూడా ఆయన ఈడి ముందు హాజరు కాలేదు.
తొలుత మార్చి 18వ తేదీన, రెండోసారి ఏప్రిల్ 2వ తేదీన ఆయన ఈడి ముందు హాజరు కావాల్సి ఉండింది. సుప్రీంకోర్టులో నడుస్తున్న న్యాయపరమైన వ్యవహారం వల్ల తాను వ్యక్తిగత తాను హాజరు కాలేకపోతున్నట్లు ఆయన ఈడి దర్యాప్తు అధికారికి తెలిపారు.
మే వరకు తనకు సమయం ఇవ్వాలని ఇంతకు ముందు కూడా మాల్యా విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని ఈడి తోసి పుచ్చింది. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసువాలా, హాజరుకు మరింత సమయం ఇవ్వాలా అనే విషయంపై ఈడి సోమవారం నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఏప్రిల్ 9వ తేదీయే ఆయనకు ఇచ్చే గడవు అని ఇంతకు ముందు ఈడి అధికారులు చెప్పారు.