మాటల తూటాలు: 'కరుణ చీర కట్టిన జయ, స్టాలిన్ ఓ బూచాడు'
చెన్నై: తమిళనాట ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎండీకే అధినేత విజయకాంత్ తొలిసారిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. మంగళవారం తాంబరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారిద్దరిపై వ్యంగ్య, విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు.
''ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఇద్దరు దోపిడీ దొంగలు వస్తున్నారు జాగ్రత్త'' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన విజయకాంత్... ఆ తర్వాత సరికొత్తగా కరుణ, జయలపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. అవినీతిలో కరుణ, జయలిద్దరూ సమఉజ్జీలేనని ఆయన ఆరోపించారు.
తన దృష్టిలో కరుణానిధి చీర కట్టిన జయ లాంటివారని, అన్నాడీఎంకే నాయకురాలు ధోవతి కట్టిన కరుణానిధి వంటివారని విమర్శించారు. 'ఐదు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలంటే ఏమిటో తెలుసా? డీఎంకే అంటే తిల్లుముల్లు మున్నేట్ర కళగం (మోసపూరిత డీఎంకే) అనీ, అన్నాడీఎంకే అంటే 'అనైత్తిలుం తిరుట్టు మున్నేట్ర కళగం (అన్నింటా దోపీడీలకు పాల్పడే పార్టీ) అని అర్థం' అని చెణుకులు విసిరారు.
ఐదు దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకేలు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశాయన్నారు. సదరు పార్టీల పేర్లను కూడా ఆయన మార్చేసి కొత్త పేర్లు పెట్టేశారు. డీఎంకేను 'తిల్లుముల్లు మున్నేట్ర కజగం (మోసపూరిత డీఎంకే)', అన్నాడీఎంకేను 'అనైత్తిల్లుం తిరుట్టు మున్నేట్ర కజగం (అన్నింటా దోపిడీలకు పాల్పడే పార్టీ)గా అభివర్ణించారు.
మరోవైపు డీఎంకే కోశాధికారి, కరుణానిధి కుమారుడు స్టాలిన్ను సైతం విజయకాంత్ టార్గెట్ చేశారు. 'డీఎంకే కోశాధికారి స్టాలిన చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే బూచాడు లాంటోడు. మా పార్టీలో చీలికలు సృష్టించి సభ్యులను దొంగిలించుకెళ్లాడు. అలాంటి వ్యక్తిని దళపతి అంటూ పొగడడడం సిగ్గుచేటు' అని విమర్శించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ కూటమి కావాలా? రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసే ఇద్దరు దొంగలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. ప్రతి సభలోనూ ప్రజల కోసమే తానున్నానంటూ గొప్పలు చెప్పుకునే జయలలిత.. చుట్టూ ఎయిర్కూలర్లు పెట్టుకుని పేజీలకు పేజీల ప్రసంగ పాఠాలు చదివి, ప్రజలను ఎండలో మాడ్చివేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అంతేకాదు బహిరంగ సభల్లో జయలలిత నడిచే తీరును సైతం విజయకాంత్ వేదికపై నటించి చూపించారు. కరుణానిధిని అబద్ధాలపుట్టగా అభివర్ణించారు. నడవలేని స్థితిలో ఉన్న జయ.. వీల్చైర్లో తలెత్తుకుని తిరగలేని స్థితిలో ఉన్న కరుణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లగలరని ప్రశ్నించారు.
విజయకాంత్ కూటమిలో మరో నాలుగు పార్టీల చేరిక
మరోవైపు తమిళనాడులో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోవడంలో విఫలమైన చిన్న చిన్న పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలో బరిలోకి దిగిన డీఎండీకే ప్రజా సంక్షేమ కూటమిలోకి మరో నాలుగు పార్టీలు చేరనున్నట్టు తెలుస్తోంది. జయలలితతో పొత్తు చర్చలు విఫలమై, ఆ పార్టీతో కలవలేకపోయిన తమిళగ వాళ్వురిమై కట్చి (టీవీకే), తమిళగ మున్నేట్ర కళగం (టీఎంకే), మూవేందర్ మున్నేట్ర కళగం పార్టీలు డీఎండీకే వైపు మొగ్గు చూపాయి.