ద్రౌపది ముర్ముకు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు: స్నేహం దృఢమవ్వాలని ఆకాంక్ష
న్యూఢిల్లీ: భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నేతృత్వంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత దృఢమవ్వాలని ఆకాంక్షించారు. ఈమేరకు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
భారతదేశంతో విశేషమైన వ్యూహాత్మకమైన భాగస్వామ్య సంబంధాలకు తాము చాలా ప్రాధాన్యత ఇస్తామని పుతిన్ పేర్కొన్నారు. దేశాధినేతగా ముర్ము నాయకత్వంలో రెండు దేశాల మధ్య రాజకీయ, ఉత్పాదక సహకారం మరింత వృద్ధి చెందుతుందని తాము విశ్వసిస్తున్నామన్నారు.
పలు రంగాల్లో మన స్నేహపూర్వక దేశాల పరస్పర ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత కోసం మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ అత్యున్నత పదవిని అలంకరించే తొలి ఆదివాసి మహిళగా ముర్ము చరిత్ర సృష్టించారు. అంతేగాక, ఈ పదవిని చేపడుతున్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా కావడం విశేషం.
ఆగస్టు 25న ముర్ము భారత నూతన 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే దేశంలోని రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా, ఇతర దేశాల అధినేతలు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.