మా వద్ద పెట్రోల్ బావులు ఉన్నాయా?: మోడీ: ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ ఇష్యూ
లక్నో: అయిదో విడత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవ్వాళ కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి పోలింగ్ ముగుస్తుంది. ఇంకో రెండు దశల పోలింగ్ పూర్తి కావాల్సి ఉంది. మార్చిలో ఈ రెండు కూడా పూర్తవుతాయి. ఉత్తర ప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 10వ తేదీన వెల్లడవుతాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరో.. ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యేదెవరో తేలేది ఆ రోజే.
ఈ రెండు విడతలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఆధిపత్యాన్ని సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తోన్నారు. ఇవ్వాళ ఆయన బస్తీలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. పెట్రోల్- డీజిల్ ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలను తిప్పి కొట్టారు. ఉక్రెయిన్ సంక్షోభాన్నీ ప్రస్తావించారు.

ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తీసుకుని వస్తున్నామని మోడీ అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ గంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇదివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకుని వచ్చామని గుర్తు చేశారు. దీనికోసం తాము రేయింబవళ్లు పని చేస్తున్నామని, కంటి మీద కునుకు లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు.
ఉక్రెయిన్లో ఇంకా చాలామంది భారతీయులు చిక్కుకుని ఉన్నారని, వారిని తీసుకుని రావడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని మోడీ చెప్పారు. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని, భారతీయు వివరాలను తెలుసుకుని- వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశామని వివరించారు. గతంలో వందేభారత్ మిషన్ తరహాలో ఇప్పుడు ఆపరేషన్ గంగాను నిర్వహిస్తున్నామని అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టడంలో అర్థం లేదని విమర్శించారు. వందశాతం భారత్- పెట్రోలియం దిగుమతుల మీద ఆధారపడి ఉందని గుర్తు చేశారు. భారత్లో పెట్రోలియం బావులేమైనా ఉన్నాయా? రేట్లు అదుపులో ఉండటానికి.. అని ప్రశ్నించారు. పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామనే విషయం ప్రతిపక్షాలకు తెలియదా అంటూ నిలదీశారు. ప్రస్తుతం ఇథనాల్, షుగర్ కేన్ నుంచి పెట్రోల్ ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications