బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, జర్నలిస్టులపై దుండగుల దాడులు: 9 మంది అరెస్ట్
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో టీఎంసీ, బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పృథ్వీష్ రంజన్ కౌర్పై కొందరు దుండగులు రాళ్లదాడి చేశారు. ఈ దాడి ఘటనలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాళ్లు, ఇటుకలు, కర్రలతో బీజేపీ నేతలకు సంబంధించిన వాహనాలపై దాడులకు పాల్పడటం స్థానిక టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. బీజేపీ నేతకు చెందిన ఓ కారు అద్దం పూర్తిగా ధ్వంసమైపోయింది. బీజేపీ అభ్యర్థి డ్రైవర్ ఈ దాడిలో గాయపడ్డారు. వెంటబడి తరుముతున్న క్రమంలో వారి వాహనం బురదలో చిక్కుకుపోయింది. ఆ తర్వాత అందులోంచి బయటికి వచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
అక్కడ్నుంచి వెళ్ళేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ దుండగులు దాడులకు పాల్పడటం గమనార్హం. బీజేపీ అభ్యర్థి కారుకు సమీపంలో ఉన్న రెండు స్థానిక న్యూస్ ఛానళ్లకు సంబంధించిన వాహనాలను కూడా దుండగులు ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. దుండగులు దాడులకు తెగబడుతూనే ఉన్నారు.
ఆ తర్వాత వెస్ట్ మిడ్నాపూర్ ఎస్పీ దినేష్ కుమార్.. భారీ ఎత్తున పోలీసు, కేంద్ర బలగాలను తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఇది ఇలావుండగా, గురువారం రెండో దశ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పలువురు దుండగులు నందిగ్రాం బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కాన్వాయ్పైనా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు బీజేపీ నేతలు గాయపడగా, సువేందు అధికారి క్షేమంగా బయటపడ్డారు. ఓటమి భయంతోనే టీఎంసీ గూండాలు బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని, మమతా బెనర్జీ పార్టీ అరాచకాలకు ఈ ఎన్నికలు ముగింపు పలుకుతాయన్నారు.