డిఫెన్స్ స్టిక్కర్ వాహనంలో అనుమానాస్పదులు: అరెస్ట్
బుర్ద్వాన్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ జిల్లాలో జమల్పూర్ ప్రాంతంలో సోమవారం అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు రక్షణ మంత్రిత్వ శాఖ స్టిక్కర్ ఉన్న ఎస్యూవీలో ప్రయాణిస్తున్నారు.
కానీ, వారి వద్ద తగిన డాక్యుమెంట్లు లేకపోవడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కారు ముందు, వెనుక విండ్ స్క్రీన్స్పై ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్' అని రాసి ఉన్న స్టిక్కర్లు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
పోలీసు పెట్రోలింగ్ వాహనం దానిని అడ్డుకొని ప్రశ్నించగా అందులోని వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని ఆ అధికారి చెప్పారు. వాహనంలో ఉన్నవారందరూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఆరుగురిని షకిల్ అహ్మద్, సలీమ్ అక్తర్, షేక్ ఇర్ఫాన్, షేక్ అస్రాఫుద్దీన్, అబు అక్తర్, ఎస్కే షారూఖ్లుగా గుర్తించినట్లు చెప్పారు. వీరంతా దక్షిణ కోల్కతాలోని తోప్సియా రోడ్ ప్రాంతానికి చెందినవారని చెప్పారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.