నేడు ఆఖరు రోజు: శశికళ పదవి ఊడిపోతే పళనిసామి ఇబ్బందే!
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను ఎలా ఎంపిక చేశారు అంటూ శశికళ ఇచ్చిన వివరణకు భారత ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదంటే ఆమె పదవి ఊడిపోతోందని, ఇన్ని రోజులు ఆమె వెనుక ఉన్న ఎమ్మెల్యేలు
బెంగళూరు/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ కావాలని తీవ్రస్థాయిలో ప్రయత్నించి చివరికి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలుపాలైన చిన్నమ్మ శశికళకు అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి ఊడిపోయేటట్లు ఉంది.
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను భారత ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటి ? అని చర్చించడానికి తమిళనాడుకు చెందిన సీనియర్ మంత్రులు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు దగ్గరకు పరుగు తీశారు.
ఎంపిక పదవి ఊడిపోతే ఎలా ?
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను భారత ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తే ఆ పదవి ఎవరికి ఇవ్వాలి ? మీరు ఎవరిని సూచిస్తారు ? అని తెలుసుకోవడానికి తమిళనాడు మంత్రులు చిన్నమ్మ దగ్గరకు వచ్చారు
జైలు అనుమతి కోసం ఎదురు చూపులు
ముగ్గురు మంత్రులు చిన్నమ్మను కలవడానికి పరప్పన అగ్రహార జైలు దగ్గరకు చేరుకున్నారు. జైలు అధికారుల అనుమతి కోసం న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. శశికళకు ఆ పదవి ఊడిపోతే పరిస్థితి ఏమిటి అని అన్నాడీఎంకేలోని ఆమె వర్గీయుల్లో అప్పుడే ఆందోళన మొదలైయ్యింది.
మేము విజయం మాదే
అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, పన్నీర్ సెల్వం వర్గీయులు మాత్రం శశికళ పదవి కచ్చితంగా ఊసిపోతోందని, కచ్చితంగా మాదే విజయం అంటున్నారు. శశికళకు అన్నాడీఎంకే పార్టీ పదవి పోయిన తరువాత మేము ఏం చెయ్యాలో అది చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కలిసి వస్తుందా పాపం శశికళ, ఇప్పుడు ఎలా ?
చిన్నమ్మ శశికళకు కాలం కలిసి వచ్చేలా కనిపించడం లేదు. కచ్చితంగా ఆమె పదవి ఊడిపోతోందని న్యాయనిపుణులు అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ నియమాలకు విరుద్దంగా శశికళ ఎంపిక జరిగిందని ఆపార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
చర్చలు న్యాయనిపుణులతో
చిన్నమ్మ శశికళ పదవిని కాపాడేందుకు ఆమె సోదరి కుమారుడు, అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ. దినకరన్ చెన్నైలో న్యాయనిపుణులతో చర్చల్లో మునిగితేలుతున్నారు. ఎలాగైనా చిన్నమ్మ పదవిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇరు వర్గాలు రెండుగా చీలిపోయిన నాయకులు
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరినొకరు బహిష్కరించుకున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని పన్నీర్ సెల్వం వర్గీయులు వాదిస్తున్నారు.
ఆయనే జయలలిత స్వయంగా నియమించారు
అన్నాడీఎంకే పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జయలలిత చేత నియమించిన మధుసూదనన్ కు పార్టీ మీద అధికారం ఉంది. ప్రస్తుతం మధుసూదనన్ పన్నీర్ సెల్వం వెనుక ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ మాదే అంటూ పన్నీర్ సెల్వం వర్గీయులు వాదిస్తున్నారు.
మంగళవారం నేడు చివరి రోజు... తాడోపేడో తేలిపోతే ?
భారత ఎన్నికల ఇచ్చిన నోటీసులకు శశికళ మంగళవారం లోపు తనను అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎంపిక చేశారు అని పూర్తి వివరణ ఇవ్వాలి. శశికళ ఇచ్చిన వివరణకు భారత ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందితే చిన్నమ్మ వర్గీయులు ఊపిరిపీల్చుకుంటారు.
అంతేనా ఎడప్పాడి పళనిసామికి ఇబ్బందులు
శశికళ ఇచ్చిన వివరణకు భారత ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదంటే ఆమె పదవి ఊడిపోతోంది. శశికళ పదవి ఊడిపోతే ఆమె వెనుక ఉన్న శాసన సభ్యులు అక్కడి నుంచి మకాం మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఎడప్పాడి పళనిసామికి ఇబ్బందికర పరిస్థితులే అంటున్నారు.