ఆ గిరిజన గ్రామానికి వెళ్లిన వారంతా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు?
ఏజెన్సీలో అనేక గిరిజన గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ఉండే సహాజ సిద్దమైన ప్రకతి అందాలను అస్వాదించేందుకు నిత్యం సందర్శకులు వస్తుంటారు. కానీ విశాఖ ఏజెన్సీలోని పెదలబుడు అనే గ్రామానికి వచ్చే టూరిస్టులు మాత్రం పెళ్లి చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులే కాదు, పొలిటిషియన్లు, ఐఏఎస్, సెలబ్రీటీలు ఒక ప్రత్యేక అనుభూతితో తిరిగి వెళుతుంటారు. అదే మళ్లీ పెళ్లి.
జనవరి 11, 2022 తేదీన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తన భార్యతో సహా అరకు సమీపంలోని పెదలబుడు గ్రామానికి వచ్చారు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపట్లోనే కాంతిలాల్ దండే దంపతులు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా తయారైపోయారు. అప్పటికే సిద్ధమైన కళ్యాణ వేదికను చేరుకున్నారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలు మోగుతుండగా...దంపతులిద్దరూ మళ్లీ వివాహం చేసుకున్నారు.
పెదలబుడు గ్రామంలో గిరి గ్రామ దర్శిని పేరుతో ఏర్పాటైన ఒక గిరిజన గ్రామంలో ఈ తంతు జరిగింది. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఆయన వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి పెద్దగా పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ వ్యవహరించారు. ఆయన చేతుల మీదుగానే ఈ తంతు మొత్తం పూర్తి చేశారు.
ఆ తర్వాత అంతా కలిసి గిరిజన సంప్రదాయ నృత్యం ధింసా చేశారు. పెళ్లి ఫొటోలకూ ఫోజులిచ్చారు.
"సాధారణంగా వివాహం అందరికి గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటాం. జీవిత కాలం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటాం. అందుకే ప్రస్తుతం డిఫరెంట్ మ్యారేజ్ కాన్సెప్ట్లకు డిమాండ్ పెరిగింది.
అయితే ఖర్చు తక్కువతో, జీవితకాలం గుర్తుండిపోయే విభిన్నమైన రీతిలో వివాహం చేసుకోవాలనుకునే వారికి గిరిజన సంప్రదాయంలో చేసుకోవడం మంచి అప్షన్. ఇక్కడి ఆచార, వ్యవహరాలతో, గిరిజన వేషధారణతో పెళ్లయిన జంటలు కూడా నూతన వధువరులుగా మారిపోతారు.
''సరదాగా మళ్లీ పెళ్లి చేసుకుని...లైఫ్ టైమ్ మెమరీగా ఆ స్మృతులను దాచుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ కాన్సెప్ట్ కు ఆకర్షితులవుతున్నారు. అధికారులు, పొలిటిషియన్లు సైతం గిరి గ్రామ దర్శినికి వచ్చి గిరిజనుల్లా మారిపోయేందుకు ఆసక్తి చూపుతున్నారు" అని గిరి గ్రామ దర్శిని ఇంఛార్జ్ దయానిధి బీబీసీతో చెప్పారు.
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- విశాఖ ఏజెన్సీ: రూఢకోటలో పుట్టిన బిడ్డలు నెలల్లోనే చనిపోతున్నారు... ఏమిటీ మిస్టరీ?
గిరిజనుల్లా ఒక రోజు...
గిరి గ్రామదర్శిని సందర్శించి గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు. అది నచ్చి, వారిలాగే కట్టు, బొట్టు ధరించి అడవి బిడ్డల్లా మారిపోతున్నారు. అలాగే ఒక రోజంతా ఆదివాసీ ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు.
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళ అల్తుర్ ఎంపీ శ్రీ రమ్య హరిదాస్లు కూడా గిరిజన మహిళల్లా మేకోవర్ అయి గిరిగ్రామ దర్శినిలో సందడి చేశారు. తిరగలి తిప్పుతూ.. రోకలిలో దంచుతూ.. కాసేపు సమయం గడిపారు.
"ఈ గిరి గ్రామ దర్శిని ద్వారా వినూత్నమైన అనుభూతి పొందేలా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ), ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్నవారు గిరిజన సంప్రదాయాల్లో జరిగే పండుగలు, వేడుకలు ఇక్కడ జరుపుకోవచ్చు. అలాగే గిరిజన పద్ధతుల్లో వివాహం చేసుకోవచ్చు. కట్టుబొట్టు నుంచి పెళ్లి విందు, అప్పగింతల వరకు వివాహ వేడుకంతా కూడా గిరి గ్రామ దర్శినిలో ఉన్న ఆదివాసీలే చూసుకుంటారు. కనుమరుగవుతున్న గిరిజన సంప్రదాయాలను నేటి తరానికి కళ్లకు కట్టే విధంగా చూపించడమే ఈ గిరి గ్రామ దర్శని ప్రధాన ఉద్దేశం" అని అరకు ఎంపీ మాధవి చెప్పారు.
- విశాఖపట్నం: సైకిళ్లు, ఎడ్ల బండ్ల మీద పన్నులు వేసిన ఈ నగరం.. అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది?
- రావిపూడి వెంకటాద్రి: 100 ఏళ్లలో 100 పుస్తకాలు రచించిన హేతువాది
'మా 'మళ్లీ పెళ్లి' ఇక్కడే...'
గిరి గ్రామాల్లో వధూవరులను ఎలా ముస్తాబు చేస్తారో అదే విధంగా గిరిజన సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలనే వారిని కూడా అలంకరిస్తారు. గిరిజన ఆభరణాలు దుస్తులతో వధూవరులను పెళ్లికి సిద్ధం చేస్తారు.
గిరిజన గ్రామాల్లో పెళ్లి వేడుకకు కల్యాణ వేదిక తరహాలోనే మండపాన్ని ముస్తాబు చేస్తారు. వివాహానికి హాజరయ్యే వారిని కూడా గిరిజనుల మాదిరిగా తయారు చేస్తారు. గిరిజన ఆచారం ప్రకారం పెళ్లి తంతు పూర్తి చేస్తారు.
"మా స్నేహితులమంతా అరకు టూర్ వచ్చాం. ఇక్కడ గిరి గ్రామ దర్శిని చూశాం. ఈ గ్రామం మొత్తం చూస్తే గిరిజన అలవాట్లు, సంప్రదాయాలు, వారి పండగల పై అవగాహన కలుగుతుంది. వీటన్నిటికంటే గిరిజన సంప్రదాయలో జరుగుతున్న వివాహం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇందులో జరిగే వివిధ ఆదివాసీ వివాహ తంతులు బాగున్నాయి. అందుకే మే నెలలో జరగబోయే మా మ్యారేజ్ డే నాడు ఇక్కడే మేం గిరిజన సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటాం" అని విశాఖ నగరానికి చెందిన స్వాతి బీబీసీతో చెప్పారు.
- విశాఖ సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీన్ని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- చరిత్ర: 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
'గిరిజన ప్రపంచంలోకి ఆహ్వానం'
గిరిజనుల జీవనం ప్రత్యేకం. గిరిజన సంప్రదాయలు విభిన్నం. కొండకొనల్లో మారుమూల గ్రామాల్లో ఉండే వీరు, తరతరాలుగా వారి సంస్కృతి, ఆచారాలను పాటిస్తూనే ఉంటారు. ఎంతో భిన్నంగా ఉండే ఆ పద్ధతులను తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటిది ఆచరిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు రూపమే ఈ కాన్సెప్ట్.
"టూరిస్టులు ఇక్కడి ఆచార వ్యవహారాలు, ఆదివాసీల జీవన విధానాలను చూసి మనం కూడా ఇలా జీవిస్తే బాగుంటుందని కదా అని అంటుంటారు. వారి ఆలోచనలకు అనుగుణంగా...టూరిస్టులను మరింత ఆకర్షించేందుకు ఐటీడీఏ కొత్త కాన్సెప్ట్ ని డిజైన్ చేసింది. ఏజెన్సీలో అడవి బిడ్డల జీవితాలు ఎలా గడుపుతారో...వారి రోజు వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడమే కాకుండా...ఒక రోజుంతా గిరిజనుల్లా బతికేందుకు ఐటీడీఏ 'ఏ డే యాజ్ ట్రైబ్' అనే కాన్సెప్ట్ ను డిజైన్ చేసింది. అందుకోసం ఒక గ్రామాన్ని సృష్టించారు. అదే 'గిరి గ్రామ దర్శిని'. ఈ గ్రామానికి వస్తే గిరిజనుల జీవితం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది" అని ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు రామ్మూర్తి అన్నారు.
గిరి గ్రామ దర్శినిని పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తుంది. స్థానిక గిరిజన యువత, గిరిజన మహిళ బృందాలు కలిసి ఈ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు.
- ఉత్తరాంధ్ర: కనీస సౌకర్యాలను నోచుకోని గిరిజన పల్లెలు
- చింతలవలస: డోలీలో గర్భిణి.. అడవిలో ప్రసవం.. రాయితో బొడ్డుతాడు కోత
'మా ఆచారాలే మాకు ఉపాధి'
అరకు నుంచి 10 కిలోమీటర్లు దూరంలో ఈ గ్రామం ఉంది. అరకు వచ్చే టూరిస్టులంతా ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడ మేకోవర్ కు పురుషులకైతే రూ.100, మహిళలకైతే రూ. 200, అలాగే గిరిజన సంప్రదాయ వివాహం చేసుకోవాలంటే రూ. 12 వేలు, ధింసా నృత్యం చేయాలంటే రూ. 6 వేలు రుసుం వసూలు చేస్తారు.
"ఇక్కడికి వచ్చే టూరిస్టులకు మేకోవర్ మేమే చేస్తాం. అలాగే ఎవరైనా గిరిజన సంప్రదాయ వంటలు చేయమని అడిగితే వారికి అవి చేస్తున్నాం. ఇక గిరిజన సంప్రదాయంలో వివాహం చేసుకునేవారికి పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసేందుకు ఒక టీం ఉంది. వారు ఉండేందుకు గదులు ఏర్పాటు, ఆహారం అందించడం, క్యాంప్ ఫైర్స్ వంటివి ఎకో టూరిజం వెల్ఫేర్ సోసైటీ తరపున మేమే ఏర్పాటు చేస్తున్నాం. ఇలా స్థానిక మహిళలు, యువత ఉపాధి పొందుతున్నాం" అని ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ తరపున పని చేస్తున్న గిరిజన మహిళ సుశీల బీబీసీతో చెప్పారు.
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- ఉత్తరాంధ్ర వలసలు: 'ఏ దేశం వెళ్లినా ఈ మూడు జిల్లాల వలస కార్మికులు కనిపిస్తారు’
'ఇది డిఫరెంట్ ప్రాజెక్టు'
ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆచార వ్యవహారాలు చాలా భిన్నంగా ఉంటాయని, అవన్నీ కూడా ప్రకృతి నుంచి పుట్టినట్లు ఉంటాయని, చెట్లు, చేమలను పూజించడం, అవి ఇచ్చే ఫలాలతోనే జీవితం గడపడం, మళ్లీ వాటికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పండుగలు చేయడం ఇలా అన్నీ ప్రకృతితోనే మమైకమై ఉంటుందని పాడేరు ఐటీడీవో పీవో ఆర్. గోపాలకృష్ణ అన్నారు.
"ప్రస్తుత ఆధునీక జీవన విధానంతో పోల్చితే గిరిజన జీవనంలో ఒత్తిడి ఉండదు. అందుకే దిగువ ప్రాంతాల (మైదాన) వారు వీటిని అనుసరించాలని అనుకుంటారు. అయితే నిత్యం కాకపోయినా, కనీసం అప్పడప్పుడైనా వాటిని అనుసరించేందుకు, అందులోని అనుభూతిని పొందేందుకు వీలుగా ఇక్కడ గిరి గ్రామ దర్శిని ఏర్పాటు చేశాం. విశాఖ ఏజెన్సీలో ఇదొక డిఫరెంట్ ప్రాజెక్టు. ఈ గ్రామంలోకి అడుగుపెట్టిన వారంతా, గిరిజనులుగా మారిపోతారు" అని పీవో గోపాలకృష్ణ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- హిజాబ్పై ముదురుతున్న వివాదం, కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేసిన ప్రభుత్వం
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
- 'నేను ప్రేమించటానికి ఎవరైనా కావాలి’
- 'పారాసిటమల్ ఎక్కువగా వాడితే రక్తపోటు పెరిగి గుండెపోటు రావొచ్చు’
- అయోధ్య: విశాలమైన రామ మందిర నిర్మాణం ఒకవైపు, శిథిల ఆలయాలు మరోవైపు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- లతా మంగేష్కర్ భౌతికకాయం దగ్గర షారుఖ్ ఖాన్ ప్రార్థనపై వివాదం, అసలేం జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)