వారణాశి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?: పార్టీ కార్యకర్తలను ప్రశ్నించిన ప్రియాంకా గాంధీ
రాయ్ బరేలీ: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. తాను పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంటే.. కాదనబోనని అన్నారు. గురువారం ఆమె ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాయ్ బరేలీ.. ప్రియాంకా గాంధీ తల్లి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం.

కొద్దిరోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్న ప్రియాంకా గాంధీ వాద్రా.. ఈ మధ్యాహ్నం రాయ్ బరేలీకి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో పాటు కూర్చుని గెలుపోటములకు గల అవకాశాలపై ఆరా తీశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు కార్యకర్తలు సూచించారు. దీని ప్రభావం ఇతర స్థానాలపై పడుతుందని, మెజారిటీ స్థానాలను గెలుచుకోవడానికి అవకాశం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు- రాయ్ బరేలీ నుంచే పోటీ చేయాలంటూ ప్రియాంకా గాంధీని కోరారు. దీనికి ప్రియాంకా గాంధీ స్పందిస్తూ.. తాను పోటీ చేయడానికి రాయ్ బరేలీనే ఎందుకని ప్రశ్నించారు. వారణాశి నుంచి ఎందుకు పోటీ చేయకూడదని అడిగారు. దీనికి కార్యకర్తల నుంచి ఒక్కొక్కరు వేర్వేరు సమాధానాలను ఇచ్చారు. సోనియాగాంధీ కుమార్తెగా రాయ్ బరేలీకే ప్రాతినిథ్యం వహించాలని కొందరు సూచించారు. సోనియా వారసత్వాన్ని కొనసాగించడానికి రాయ్ బరేలీ మెరుగైనదని అన్నారు.
80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో ఏడు దశల్లో పోలింగ్ కొనసాగనుంది. ఏప్రిల్ 11వ తేదీన తొలిదశ మొదలుకుని, మే 19న ముగిసే చివరిదశ వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలు ఉంటాయి. మే 23వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications