Exclusive : కరోనాపై పోరులో వ్యాక్సిన్ ఎందుకు తప్పనిసరి... ఎయిమ్స్ డైరెక్టర్ ఏమంటున్నారు...
ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్,శ్వాసకోశ వైద్య నిపుణులు డా.రణదీప్ గులేరియా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులు,వ్యాక్సినేషన్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను 'వన్ ఇండియా'కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు ఎంతవరకు దోహదపడనున్నాయి... రాబోయే రోజుల్లో సాధారణ జలుబు,దగ్గు స్థాయికి కరోనా తీవ్రత తగ్గుతుందా వంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలను ఇక్కడ పరిశీలించవచ్చు...
1) కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో వ్యాక్సిన్లు ఎలా దోహదపడనున్నాయి...?
డా.రణదీప్ గులేరియా : వ్యాక్సిన్ మనకు రెండు విషయాల్లో దోహదపడుతుంది. ఒకటి, వ్యాక్సిన్ ద్వారా మరణాలు తగ్గుతాయి... రెండు, ఇది కేసుల సంఖ్యను తగ్గిస్తుంది. 50 ఏళ్లు పైబడి అప్పటికే మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారిలోనే కోవిడ్ 19 మరణాల రేటు 84శాతంగా ఉంది. వీళ్లలో కోవిడ్ 19 తీవ్రతను తగ్గించగలిగితే.. మరణాల రేటును తగ్గించగలుగుతాము. అలాగే గణనీయమైన సంఖ్యలో వ్యాక్సిన్ ఇవ్వగలిగితే... అప్పటికే సహజంగా రోగ నిరోధక శక్తిని పొందినవారు కూడా ఉంటారు కాబట్టి... దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీకి అవకాశం ఉంటుంది. తద్వారా మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్లగలం.

2) రాబోయే రోజుల్లో కోవిడ్ 19 తీవ్రత సాధారణ జలుబు,దగ్గు స్థాయికి తగ్గుతుందని మీరు భావిస్తున్నారా..?
డా.రణదీప్ గులేరియా : మన హెల్త్ కేర్ సిబ్బందిని,ఫ్రంట్ లైన్ వర్కర్స్ను,వృద్దులను,హైరిస్క్ ఉన్న గ్రూపుల వారిని కాపాడుకోగలుగుతూ... మరణాల రేటును,వైరస్ వ్యాప్తి తీవ్రతను తగ్గించుకోగలిగితే... అప్పుడు కోవిడ్ 19 తీవ్రత సాధారణ జలుబు,దగ్గు స్థాయికి వస్తుందని చెప్పాలి. అయితే ఇలా జరగడం వల్ల ఒక్క మరణం కూడా సంభవించదని నేను చెప్పట్లేదు. ప్రతీ ఏటా ఇన్ఫ్లుయెంజా కారణంగా కూడా కొంతమంది చనిపోతున్న విషయం మనకు తెలిసిందే.
3) వ్యాక్సిన్లు సురక్షితంగా,సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కచ్చితంగా చెప్పగలమా?
డా.రణదీప్ గులేరియా- మనకున్న డేటానే చెబుతోంది వ్యాక్సిన్లు సురక్షితం అని. అయితే వాటివల్ల కొద్దిపాటి నొప్పి,జ్వరం,వాపు,తదితర ఆరోగ్య సమస్యలు చాలా సహజం. వ్యాక్సిన్ మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తోందని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ వివిధ కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయినవారి సంఖ్య దాదాపు 90వేలుగా ఉంది. ఇది చాలా పెద్ద సంఖ్య. వ్యాక్సిన్ల కారణంగా తలెత్తే చిన్నపాటి సమస్యల కంటే దాని ద్వారా జరిగే మేలు చాలా విస్తృతమైనది.
వ్యాక్సిన్ సమర్థత గురించి మాట్లాడితే... అది మనకు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇందుకు సమాధానం 'అవును' అన్నది అందరికీ తెలిసిందే. అయితే పూర్తి స్థాయిలో అది రక్షణ కల్పిస్తుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న డేటా ప్రకారం... కరోనా వ్యాక్సిన్ ద్వారా ఆర్నెళ్ల పాటు కచ్చితంగా రక్షణ పొందవచ్చు. కొంతమందిలో ఏడాది నుంచి రెండేళ్ల వరకూ దీని ప్రభావం ఉంటుంది.
4) ఏ ప్రాతిపదికన వ్యాక్సిన్లకు అనుమతినిచ్చారు...?
డా.రణదీప్ గులేరియా : మొదట సేఫ్టీ,వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఆ తర్వాత భారీ ఎత్తున ప్రజలకు టీకా పంపిణీ చేయడం సాధ్యమేనా వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటాం. ఆపై ధరను పరిశీలిస్తాం. ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఈ విషయంలో సంతృప్తికర ఫలితాలినిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ను 2-8డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ సదుపాయాలు మన వద్ద ఉన్నాయి.
5) కోవిడ్ 19 వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో కొన్ని భయాలు కూడా ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నవారికి మీరేం చెప్తారు..?
నేను చెప్పేదొకటే... మన రెగ్యులేటరీ సంస్థలు అనుమతించిన వ్యాక్సిన్లు సురక్షితమైనవి,సమర్థవంతమైనవి. భారత ప్రజానీకానికి హానీ చేసే వ్యాక్సిన్లను రెగ్యులేటరీ సంస్థలు అనుమతించవు కదా. కాబట్టి ప్రజలు వ్యాక్సిన్ పట్ల నమ్మకం ఉంచాలి. సామాజికంగా,ఆర్థికంగా,అన్ని రకాలుగా ప్రస్తుత సమాజంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి.
6) టీకా తీసుకున్న తర్వాత కోవిడ్ 19 జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి..?
Recommended Video
మొదటి డోసు తీసుకున్న తర్వాత తమలో 50శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు కొంతమంది నాతో చెప్పారు. ఇందులో నిజం లేదు. రెండు డోసులు తీసుకున్న 10,15 రోజుల తర్వాతే శరీరంలో పూర్తి స్తాయిలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. అయినప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా ఇక వైరస్ సోకదని అనుకోవద్దు. అప్పటికీ వైరస్ సోకే అవకాశం,మీ ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరో ఏడాది పాటు మాస్కులు ధరించడం చేయాల్సిందే.












Click it and Unblock the Notifications