Karnataka Polls : సిద్ధూకు రెండో సీటు నిరాకరణ ! డీకేఎస్ పంతం నెగ్గించుకున్నారా ?
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి రెండు సీట్ల నుంచి పోటీ చేయాలన్న మాజీ సీఎం సిద్ధరామయ్య కలలు నెరవేరలేదు. కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ కు విజయవకాశాలు ఉన్నాయని సర్వేలు అంచనా వేస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రకటించిన వరుణ సీటుతో పాటు కోలార్ సీటులోనూ పోటీ చేయాలని సిద్ధూ భావించారు. అయితే తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన మూడో జాబితాలో కోలార్ సీటులో కొత్తూరు మంజునాథ్ కు టికెట్ కేటాయించారు. దీంతో సిద్ధూ ఆశలు అడియాశలయ్యాయి.
వాస్తవానికి ఈ సారి ఎన్నికల్లో కోలార్ లో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేల ద్వారా నిర్ధారించుకున్న సిద్దరామయ్య ఈ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వరుణ కంటే కూడా కోలార్ సీటులో తనకు అవకాశం దక్కుతుందని అంచనా వేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తొలి జాబితాలోనే ఆయనకు వరుణ స్ధానంలో సీటు కేటాయించింది. దీంతో ఆయనకు కోలార్ సీటు దక్కుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ మొదలైంది.

తాజాగా ప్రకటించిన కాంగ్రెస్ మూడో లిస్టులో సిద్ధూకు కోలార్ సీటు దక్కకపోవడం వెనుక పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ పాత్ర ఉందనే చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం పార్టీలో నేతలెవరికీ రెండో సీటు నుంచి పోటీ చేయించొద్దంటూ గతం నుంచీ శివకుమార్ పట్టుబడుతున్నారు. సిద్ధూకు చెక్ పెట్టేందుకే ఈ వాదనను డీకే శివకుమార్ తెరపైకి తెచ్చారని గతం నుంచే ప్రచారం జరుగుతోంది. ఈసారి కాంగ్రెస్ గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఉన్న సిద్ధరామయ్యకు రెండు సీట్లలో పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆయన అవకాశాలు మరింత మెరుగుపర్చినట్లవుతుందని డీకేఎస్ భావించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో లింగాయత్ ల హవా కొనసాగుతోంది. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రేపు కాంగ్రెస్ గెలిస్తే సీఎం సీటుకు సిద్ధరామయ్య ముందుగా పోటీలో ఉంటారు. ఆ తర్వాత మాత్రమే డీకే శివకుమార్ కు అవకాశాలు ఉంటాయి. కానీ సిద్ధరామయ్య గెలవకపోతే మాత్రం డీకేఎస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో సిద్ధూ కోరుకున్న కోలార్ సీటును నిరాకరించడం ద్వారా డీకేఎస్ తన అవకాశాలు మెరుగుపర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications